Rajamouli : రాజమౌళి తర్వాతి ‘పాన్ ఇండియా’ ప్లాన్.. ట్రిపుల్ ధమాకా.?

Rajamouli : జక్కన్న రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రచార పనుల్లో బిజీగా వున్నాడు. సినిమాల్ని తెరకెక్కించడానికి ఎంత కష్టపడతాడో, ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసం కూడా రాజమౌళి అంతే కష్టపడతాడు. నిజానికి, రాజమౌళి సినిమాలకి.. రాజమౌళినే బ్రాండ్ అంబాసిడర్.. ఆ సినిమాలో ఎలాంటి స్టార్లు వున్నాసరే.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఒక ఆర్.. రామ్ చరణ్ అయితే, ఇంకో ఆర్ రామారావు అలియాన్ ఎన్టీయార్. మూడో ఆర్.. అంటే ముమ్మాటికీ రాజమౌళినే. ఇప్పటికి ఇలా, మరి తదుపరి రాజమౌళి సినిమా ఎలా వుండబోతోంది.? ఈసారి ఇద్దరు హీరోలు కాదు, ముగ్గురు హీరోలతో సినిమా వుండబోతోంది రాజమౌళి నుంచి.. అంటున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది దర్శకులు మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించాలనుకుంటున్నారనీ, ఇద్దరేసి.. ముగ్గురేసి.. నలుగురేసి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నారని రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజమౌళి మాటల్లో నిజం లేకపోలేదు. మల్టీస్టారర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు కొత్త కాదు. వెంకటేష్, మహేష్‌బాబు కలిసి సినిమా చేశారు.. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి సినిమా చేశారు. కానీ, అలాంటి మల్టీస్టారర్లు విరివిగా రావడంలేదంతే.

ఇదిలా వుంటే, రాజమౌళి మదిలో ట్రిపుల్ ధమాకా వుందనీ.. ఆ విషయం త్వరలోనే వెల్లడి కాబోతోందనీ, తెలుగు సినీ పరిశ్రమ నుంచే ముగ్గురు అగ్రహీరోలు ఆ సినిమాలో నటించబోతున్నారనీ ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే, అది ‘ఆర్ఆర్ఆర్’ కంటే పెద్ద సినిమా అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.