పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీగా అవకాశం … సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం !

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. కాగా, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతారు.

ఆమె ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.

పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత పీవీ శతజయంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు ఏడాదిపాటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేె.కేశవరావు చైర్మన్‌గా ఉండగా, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె సురభి వాణిదేవి కూడా సభ్యులుగా ఉన్నారు.