జోరు మీదున్న నాగార్జున‌.. యంగ్ ద‌ర్శ‌కుడితో కొత్త సినిమా

అక్కినేని నాగార్జున స్పీడు మీదున్నాడు. కుర్ర హీరోల‌కు పోటీగా వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. మరోవైపు బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా కూడా చేస్తున్నాడు. చివ‌రిగా మ‌న్మ‌థుడు2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించిన నాగార్జున ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్, బ్ర‌హ్మాస్త్రా చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వైల్డ్ డాగ్ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు.

వైల్డ్ డాగ్ చిత్రంలో దియా మీర్జా కథానాయికగా నటిస్తుండ‌గా, సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు నాగార్జున 15 ఏళ్ల త‌ర్వాత న‌టించిన బాలీవుడ్ చిత్రం బ్ర‌హ్మాస్త్రా రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌ల‌తో పాటు ద‌ర్శ‌కుడితో క‌లిసి నాగార్జున గ్రూప్ ఫొటో దిగ‌గా, దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న పార్ట్ ముగిసింద‌ని పేర్కొన్నాడు.

ఇక ఈ రోజు త‌న తదుప‌రి చిత్రం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని తెలిపారు నాగార్జున‌. కొద్ది సేప‌టి క్రితం ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయంలో ఈ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. గరుడ వేగ లాంటి సూప‌ర్ హిట్ అందించిన ప్ర‌వీణ్ స‌త్తారు ఇప్పుడు నాగ్‌తో సినిమా చేస్తుండ‌డంతో అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా పెరిగాయి.