పృథ్వీ కూడా నీతులు చెబుతున్నాడుగా.. వాళ్లు ఏ విధంగా స్పందిస్తారో?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైరల్ అయిన వీడియో వెనుక టీడీపీ హస్తం ఉందనే విధంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనంతపురం ఎస్పీ చేసిన ప్రకటన వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ నేతలు సంతోషిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం ఫీలవుతున్నారు. అయితే వైసీపీ తరపున టీటీడీ ఛానల్ డైరెక్టర్ గా పని చేసి వివాదంలో చిక్కుకుని పదవి కోల్పోయిన పృథ్వీరాజ్ ప్రస్తుతం నీతులు చెబుతున్నారు.

గతంలో ఒక మహిళతో ఇష్టానుసారం మాట్లాడటం వల్ల పృథ్వీ పదవి పోయిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పృథ్వీ జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ ది సిగ్గుమాలిన పని అని మాధవ్ తెలుగు ఎంపీల పరువు తీసేశాడని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటనను సైతం పృథ్వీరాజ్ తప్పుపట్టారు. తాను వివాదంలో చిక్కుకున్న సమయంలో వైసీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

వైసీపీకి చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సపోర్ట్ చేసినా పృథ్వీకే సులువుగా పదవి దక్కింది. అయితే తన తప్పుడు ప్రవర్తన వల్ల పృథ్వీ పదవిని కోల్పోయారు. పృథ్వీ కూడా ప్రస్తుతం నీతులు చెప్పడం వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన వాయిస్ ను మిమిక్రీ చేశారని చెప్పిన పృథ్వీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అధికారులే చెప్పినా నమ్మడం లేదు.

పృథ్వీ 2024 ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగానో లేక ఎంపీగానో పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. జనసేనలో పదవుల కోసం పృథ్వీ వైసీపీ తరపున విమర్శలు చేస్తుండటం గమనార్హం. జనసేనలో కూడా పృథ్వీ ఆశించిన పదవులు దక్కని పక్షంలో పృథ్వీ ఆ పార్టీపై కూడా విమర్శలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.