ప్రభాస్ సినిమా మొదలు.. మొదట అమితాబ్ మీదనే

ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ మొదలుకుని ‘సలార్, ఆదిపురుష్’ లాంటి ప్రతి చిత్రమూ పాన్ ఇండియా చిత్రమే, అయితే ఒక సినిమా మాత్రం పాన్ వరల్డ్ సినిమా. అదే నాగ్ అశ్విన్ చిత్రం. ఈ సినిమాను ఇండియా లెవల్లో కాదు ఏకంగా ప్రపంచ స్థాయిలో ఉండేలా తెరకెక్కించాలని ఆలోచనట. ఇదొక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం. దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యవయంతో ఈ సినిమా ఉండబోతోంది.

పలు కారణాల రీత్యా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమాను ఈరోజే అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నారు. అధికారికంగా షూటింగ్ కూడ ఈరోజే మొదలుకానుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ మీద షూటింగ్ జరగనుంది. వారం రోజులపాటు ఆయన చిత్రీకరణలో పాల్గొంటారట. ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్, సలార్’ రెండూ సెట్స్ మీద ఉన్నాయి. వాటి చిత్రీకరణ ఒక కొలిక్కి రాగానే ప్రభాస్ సైతం షూటింగ్లో జాయిన్ అవుతారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ 100 కోట్ల వరకు అందుకుంటున్నట్టు తెలుస్తోంది.