ప్రభాస్తో సినిమా చేయడానికి స్టార్ దర్శకులు, బడా నిర్మాతలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ డేట్లు ఇవ్వాలే కానీ మూడేళ్లయినా వెయిట్ చేస్తామని అంటున్నారు. నిజానికి ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ దాంతో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా చేయాలి. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ డిగిపోయాడు. ఆయన చెప్పిన ‘సలార్’ స్టోరీ ప్రభాస్ కు బాగా నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ కూడ ఆలస్యం లేకుండా సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. దీంతో నాగ్ అశ్విన్ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.
ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాకనే నాగ్ అశ్విన్ సినిమాను మొదలుపెడతాడు ప్రభాస్. అంటే అనుకున్న సమయానికంటే ఆలస్యంగానే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆలస్యం మరింత పెరిగేలా ఉంది. లాక్ డౌన్ దెబ్బకు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో ‘సలార్’ను వచ్చే ఏడాది ఆరంభానికి పూర్తిచేయాలన్న ప్రశాంత్ నీల్ టార్గెట్ మిస్సయ్యేలా ఉంది. అందుకే ప్రభాస్ మునుపు ఇచ్చిన డేట్స్ కంటే అదనంగా డేట్స్ ఇస్తున్నాడట ‘సలార్’ కోసం. లాక్ డౌన్ ఎత్తివేసాక ఎక్కువ రోజులు ‘సలార్’ కోసమే కేటాయించి ఫిబ్రవరి నాటికి సినిమా పూర్తిచేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. దీంతో నాగ్ అశ్విన్ సినిమా, ‘ఆదిపురుష్’ రెండూ కొద్దిగా ఆలస్యం కానున్నాయి.