ఈ నెల 23న 4కె వెర్షన్ లో ప్రభాస్ ‘బిల్లా’ విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ…ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక ఒరిజినల్ కథ చెప్పాను. దానికి బడ్జెట్ తక్కువ అవుతుంది. అలాగే ఈ బిల్లా స్టోరీ చేద్దామన్నాను. దీనికి ఖర్చు ఎక్కువ, అయితే ఇండియన్ స్క్రీన్ మీద స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ రూపొందిద్దామని చెప్పాను. ప్రభాస్ తక్కువ బడ్జెట్ కథ ఎందుకు బిల్లానే చేద్దాం ఫిక్స్ చేయి డార్లింగ్ అన్నారు. అలా బిల్లా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రారంభించాం. ఈ సినిమా కోసం మేము అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు కృష్ణంరాజు గారు. రెండు హెలికాప్టర్ లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు నటించాలనే ఆలోచన ప్రభాస్ దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక  డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోను ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలి అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తూ కృష్ణంరాజు గారు మనకు దూరమయ్యారు. ఈ సినిమాను కేవలం నాలుగున్నర నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది. టీమ్ అంతా ప్యాషన్ తో వర్క్ చేశాం. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్ వైడ్ గా ఈ నెల 23న బిల్లా రిలీజ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయండి. అన్నారు.
హాస్య నటుడు అలీ మాట్లాడుతూ…ఈ బిల్లా సినిమాలో నేను నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణంరాజు గారితో ఎక్కువ టైమ్ గడిపే అవకాశం దొరికింది. ఆయన వేసే జోకులకు బాగా నవ్వుకునేవాడిని. అర్థరాత్రి బిర్యానీ తెప్పించేవారు. హీరోలకు ఆ అవకాశం లేదురా మనం తిందాం అనేవారు సరదాగా. కృష్ణంరాజు గారు గొప్ప మనిషి. ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అన్నారు.
సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ…ఈ సినిమా సంగీతం సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. బిల్లా వంద రోజుల తర్వాత తమిళంలో హీరో విజయ్ తో ఓ సినిమా చేసేందుకు వెళ్లాను. కథ విన్నాక మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడని అడిగితే మీ బిల్లా పాటలన్నీ మాకు ఇచ్చేయండి ఈ సినిమాలో పెట్టుకుంటాం. అన్నారు. బిల్లా పాటల క్రేజ్ అలాంటిది. ఈ సినిమా మళ్లీ విడుదలవడం సంతోషంగా ఉంది. అన్నారు.
ప్రసీధ మాట్లాడుతూ…బిల్లా సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. నాన్నకు ఈ చిత్రాన్ని మళ్లీ అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయోబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న కృష్ణంరాజు గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ…ప్రభాస్ గారి ఇమేజ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇలాంటి సమయంలో వరల్డ్ వైడ్ గా బిల్లా చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణంరాజు గారి కీర్తి ప్రతిష్టల్ని ప్రభాస్, ప్రసీధ ఆయన ఇతర కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నా. అన్నారు.