ఇటీవల సినిమా సంబంధిత కార్యక్రమాలలో మాట్లాడుతూ ఇతర నటులపై నోరు పారేసుకోవడం పలువురు సీనియర్ ఆర్టిస్టలుకు పరిపాటి అయిపోయింది. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటున్నాడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ, నట కిరీటి గద్దె రాజేంద్ర ప్రసాద్. దీంతో.. “వయసు పెరిగింది, కావాల్సినంత అనుభవం ఉంది, గొప్ప నటుడన్న పేరూ ఉంది.. కానీ సంస్కారమే కొరవడింది” అనే మాటలు గత కొంతకాలంగా ఈ నట కిరీటి గురించి వినిపిస్తోన్న పరిస్థితి.
అవును… ఆ మధ్య నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ సంబోధించిన రాజేంద్ర ప్రసాద్… ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకలో పాల్గొన్న సమయంలో అలీని లం** కొడుకు అంటూ మాట్లాడారు. ఇక బ్రహ్మానందాన్ని ముం** కొడుకు అంటూ మాట్లాడి, కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు హీరోయిన్ రాశీఖన్నాను “ఏమే” అంటూ సంభోదించారు.
దీంతో… రాజేంద్ర ప్రసాద్ కి నిజంగానే సభ్యత లేదా..? పెద్ద వయసు వచ్చింది, కాస్త హుందాగా నడుచుకుందాం అనే విజ్ఞత లేదా..? ఎన్టీఆర్ అంతటి మహానుభావుల సహచర్యంలో నడిచిన వ్యక్తిని అని చెప్పుకునే ఆయనకు ఇంగితం లేదా..? దాదాపు 70 ఏళ్ల వయసు, సుమారు 50 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం.. దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించిన చరిత్ర ఉండి ఏమి ఉపయోగం..? సంస్కారం లేనప్పుడు, సభామర్యాద తెలియనప్పుడు.. ? అనే ప్రశ్నలే తెరపైకి వస్తోన్నాయి!
ఇక ఓ సందర్భంలో… ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఏపీకి వెళ్లానని చెప్పారు నట కిరీటి. అప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో… “ఏంటీ మీరు చప్పట్లు కొట్టరా..? ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే చప్పట్లు కొట్టరా..? బ్రెయిన్ పోయిందా..? చప్పట్లు కొట్టకుంటే వారికి సిగ్గులేనట్లే..! అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు. దీంతో… నటనకు కిరీటం అయితే ఉంది కానీ, తల లోపల మెదడు అనే ఓ భాగం ఉంటుందని, అది సరిగ్గానే ఉందా..? అంటూ పలువురు నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
అలా అని రాజేంద్ర ప్రసాద్ శృతిమించిన కామెంట్ల పైత్య తెలుగు నటీనటుల వరకే పరిమితం కాలేదు.. పక్కనున్న తమిళనాడుకూ పాకింది. ఇందులో భాగంగా… తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పైనా ఈ నట కిరీటం అనుచిత వ్యాఖ్యలు చేశారు. లెజెండరీ నటుడు కాంతారావు గొప్పదనం గురించి వివరిస్తూ, ఒక్కసారిగా గీత దాటారు.
ఇందులో భాగంగా… జానపద చిత్రాల్లో కాంతారావు కత్తి సాము, నటన చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ “భయంతో పోసుకునేవారని” షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు జానపద చిత్రాలను చూసిన ఎంజీఆర్.. “ఇండియన్ సినిమాను మొత్తం లేపుకెళ్లిపోతున్నాడ”ని భావించి “ఉచ్చ పోశారు” అంటూ రిపీట్ చేశారు. దీనిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి!
ఇలా తనకంటే వయసులో చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు, బ్రతికున్నవారు, స్వర్గస్తులైనవారు అనే తేడా లేమీ లేకుండా… నోరు జారుతుంటున్నారు రాజేంద్ర ప్రసాద్. ఏదో ఒకసారి జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు, రెండు సార్లు జరిగిందంటే గ్రహపాటు అని సర్ధుకోవచ్చు.. ఇదే పనిగా జరుగుతుంటే అది అలవాటని అనుకోవాలి.. లేదా, “మత్తు”లో మాట్లాడున్నారని భావించాలి!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆయన నోరు జారడం, వెంటనే నెటిజన్లు వాయించి వదలడం, దీంతో.. బందాలు కలుపేసుకుంటూ క్షమాపణలు చెప్పడం కూడా ఈ రాజేంద్రుడికి అలావాటైపోయింది! ఈ వయసులో తన నోటి మాట కారణంగా ఇంత మందికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుందే అని ఆయన ఏనాడూ ఆలోచించుకోలేదో.. లేక, మరేదైనా కారణం ఉందేమో తెలియదు కానీ… సిరీస్ మాత్రం కంటిన్యూ అవుతోంది!
ఈ క్రమంలో… వార్నర్ క్రికెట్ అంటే తనకు ఇష్టమని, తన సినిమాలంటే వార్నర్ కు ఇష్టమని, అతను తన కొడుకు లాంటి వాడని చెబుతూ… బహిరంగ క్షమాపణలు చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఇదే క్రమంలో అలీ విషయంలోనూ క్షమాపణలు చెప్పారు. బ్రహ్మానందం విషయంలో స్టేజిపైనే.. “అన్నది నిన్ను కాదు నన్ను” అన్నట్లుగా చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎంజీఆర్ విషయంలోనూ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. అడుసు తొక్కనేల, కాడు కడుగనేలా..?
దీంతో నాలుగు గోడల మధ్యా ఎలా నడుచుకున్నా పర్లేదు కానీ… పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మాత్రం నోరు ఆదుపులో పెట్టుకోవాలని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పలువురు హితవు పలుకుతున్నారు. ఇన్నాళ్లు సినిమాల ద్వారా తెచ్చుకున్న పేరును ఇలాంటి వ్యాఖ్యలతో చెడగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా… ఇకపై ఏ సినిమా ఫంక్షన్లకు పోకుండా ఉంటేనే మంచిదని ఆయన అభిమానులు కోరుతుండగా… ఆయనను పిలవకపోవడం అందరికీ మంచిదని సినిమా అభిమానులు కోరుతున్నారు.
ఇప్పుడు ఈ చర్చ మరోసారి ఎందుకంటే… రాజేంద్ర ప్రసాద్ నటిస్తోన్న పలు సినిమాలు విడుదలకు సిద్ధం కాబోతున్నాయని.. ఈ క్రమంలో వాటికి సంబంధించిన పలు పబ్లిక్ కార్యక్రమాలు జరగనున్నాయని.. పైగా అవన్నీ రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయని.. ఈ క్రమంలో ఆయన మళ్లీ వేదికపై మైకు ఇచ్చుకుని ఏదైనా మాట్లాడకూడనిది మాట్లాడతారేమో.. మళ్లీ చేతులు కట్టుకుని బహిరంగ క్షమాపణలు చెబుతారేమో.. ఆ పరిస్థితి మళ్లీ రాకూడదు అని కోరుకుంటూ.. అందుకు రెండే మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయన అభిమానులు.
అందులో ఒకటి… సినిమా ఫంక్షన్స్ వీలైతే ఫంక్షన్ గా కాకుండా లైవ్ లేని ప్రెస్ మీట్ గా పెట్టాలని.. ఫలితంగా రికార్డ్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన అనంతరం జనాల్లోకి వదిలే అవకాశం ఉంటుందని చెబుతుండగా… మరొకటి… ఆయనను సదరు సినిమా ఫంక్షన్స్ కి ఆహ్వానించకుండా ఉండటమేనని అంటున్నారు. మరి అభిమానుల ఆవేదనను అటు రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇటు ఆయన నటిస్తోన్న సినిమాలకు సంబంధించిన పెద్దలు కానీ అర్ధం చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి!
