టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే గాక, అదే స్థాయిలో కెరీర్ లో అలుపు లేకుండా దూసుకెళుతోంది పూజా హెగ్డే. అగ్రహీరోలందరి సరసనా నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎనలేని స్టామినాను ప్రదర్శిస్తూ సాటి నటీమణులకు సవాల్ విసురుతోంది. అయితే.. టాలీవుడ్ లో ఇంతటి స్థాయిని సొంతం చేసుకున్నప్పటికీ, తన మనసు మాత్రం బాలీవుడ్ వైపే తొంగి చూస్తోంది.
అసలు విషయాల్లోకి వెళితే.. టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్పైనే పూజ దృష్టి సారించింది. హృతిక్ రోషన్ `మొహంజదారో` సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అక్కడ పూజ కెరీర్ ముందుకు సాగలేదు. అటుపై దక్షిణాది పై దృష్టి పెట్టి.. ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత`హౌస్ఫుల్-4`తో బాలీవుడ్లోనూ సక్సెస్ అందుకుంది.
మీడియాతో హిందీలో తన తొలిచిత్రం అనుభవాలను గుర్తు చేసుకుంది… “తొలి సినిమా `మొహంజదారో` పరాజయం పాలవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఎవరికైనా మొదటి సినిమా ఎంతో కీలకమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా ఫెయిల్ కావడంతో గుండె పగిలినంత పనైంది. అయితే దక్షిణాదిన విజయం సాధించడంతో ధైర్యంగా ముందుకు వెళ్లాను. మొదటి సినిమా విఫలం కావడం వల్లే.. బాలీవుడ్లో రెండో సినిమాకు సంతకం చేసేందుకు గ్యాప్ తీసుకున్నా. అయితే `హౌస్ఫుల్-4` ఘన విజయం సాధించడంతో బాలీవుడ్పై కూడా దృష్టి సారించాను” అని పూజా హెగ్డే చెప్పింది.
పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలు ఉన్నాయి. ప్రభాస్తో కలిసి ఫిక్షనల్ రొమాంటిక్ ‘రాధేశ్యామ్’ చేస్తుండగా.. అఖిల్తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్లోనూ హీరో రణవీర్ సింగ్తో కలిసి ‘సర్కస్’ అనే కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఇది ‘అంగూర్’ (1982) చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది. దీనికి ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సర్కస్’ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నందుకు పూజా హెగ్డే తెగ ఆనంద పడుతోంది. రోహిత్తో కలిసి పని చేస్తున్నానంటే సంతోషం పట్టలేకుందట. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తుందట. ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుందట. రణ్వీర్ కూడా డబుల్ యాక్షన్ చేస్తున్నారట.
కాగా పూజా బాలీవుడ్లో మరో చిత్రంలో కూడా మెరవనున్నారు. “కబీ ఈద్ కబీ దివాళి”లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో జోడీ కట్టనుంది. అలాగే అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ లో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. సరికొత్త డైలాగ్లతో వచ్చిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.