చంద్రబాబు హయాంలోనే దాదాపు 70 శాతం మేర పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక, కేంద్రం చెప్పిన లెక్కలే ఫైనల్. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల సమయంలో, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు పోలవరం ప్రాజెక్టకి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారన్నది నరేంద్ర మోడీ ఆరోపణ. అయితే, కేంద్రం తరఫున పోలవరం ప్రాజెక్టు పేరుతో జరిగిన దోపిడీపై ఇంతవరకు ఎలాంటి విచారణా జరగలేదు. అసలు పోలవరం ప్రాజెక్టులో అవినీతి అనేదే జరగలేదని కేంద్రం ఇప్పటికే పలుమార్లు సర్టిఫికెట్ ఇచ్చేయడం గమనార్హం. ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిజానికి, రాజకీయ విమర్శలు, వివాదాలతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే వున్నాయి.. అయితే, అప్పుడప్పుడూ వివిధ కారణాలతో పనులు ఆలస్యమవుతున్న మాట వాస్తవం. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్ట ఆలోచన తెరపైకొచ్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్నం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక పెరిగింది. అయితే, అప్పట్లోనూ పోలవరం ప్రాజెక్టు పేరుతో చాలా అవినీతి ఆరోపణలు తెరపైకొచ్చాయి. ప్రస్తుతం గేట్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే వర్షాకాలంలో ఈ గేట్ల నుంచే కిందికి నీటిని వదలడం జరుగుతుందని అధికారులు అంటున్నారు. అయితే, గేట్ల బిగింపుతో పోలవరం ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చినట్లేనా.? అంటే, ఇంకా జరగాల్సిన పనులు చాలానే వున్నాయి. కేంద్రం, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో సగం మేర నిధులు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ముంపు పరిహారం, పునరావాసం అత్యంత కీలకం. కానీ, వీటి విషయమై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కొరవడుతోంది. నీటి ప్రవాహాన్ని మళ్ళించడం, నీటిని నిల్వ చేయడం, విద్యుత్ తయారీ, అదనపు నీటిి కిందికి వదలడం.. ఇదీ ప్రాజెక్టు లక్ష్యం. ఈ లక్ష్యానికి ప్రాజెక్టు ఇంకా చాలా దూరంలోనే వుంది. జూన్ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, 2018 చివరి నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. ఏమో, 2024 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి.