Pawan Slams : కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాల విషయంలో సమంజసంగా లేదని స్వయానా జనసేన పార్టీ అభిప్రాయపడింది. మరి, అలాంటప్పుడు జనసేన పార్టీ ప్రశ్నించాల్సింది ఎవర్ని.? కేంద్ర ప్రభుత్వాన్నే కదా.! కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వున్న వైసీపీని నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న జనసేన, తమ రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్సార్సీపీని భావించడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఇది రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి వున్న అంశం. రాష్ట్రంలో అధికారంలో వున్నవారికి వివిధ రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభిస్తే, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీపై పోరాడేందుకు వీలు కలగుతుంది. తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ, వైఎస్ జగన్ అధికారంలో వున్నప్పుడూ.. రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయాలే రాష్ట్రానికి శాపంగా మారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిపోయిందని అప్పట్లో వైసీపీ గగ్గోలు పెట్టడంతో ఆ ప్రాజెక్టుకి సరిగ్గా నిధులు కేటాయించకుండా తప్పించుకుంది బీజేపీ. ఇప్పుడూ అదే పరిస్థితి.
జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్గానే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆ పార్టీకి ఫోకస్ ఎక్కువ. బడ్జెట్ విషయంలో ఏపీలోని అధికార పక్షాన్ని విమర్శించినట్లు, తెలంగాణలోని అధికార పక్షాన్ని జనసేనాని ప్రశ్నించగలరా.? ఛాన్సే లేదు.
‘కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి ముఖ్యమంత్రి అడుగుతున్నారా.? లేదా.? అడిగామని మీరు చెబుతున్నారు, నిదులెందుకు రావడంలేదు.?’ అని జనసేనాని, వైసీపీని ప్రశ్నించడంలో అర్థం ఏమన్నా వుందా.? ఆ ప్రశ్న వేయాల్సింది బీజేపీనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ.
