పరిటాల సునీతమ్మా.. ఆ విషయం మర్చిపోతే ఎలాగమ్మా.?

మాజీ మంత్రి పరిటాల సునీత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి సంచలన వ్యాఖ్యలు కావివి.. వివాదాస్పద వ్యాఖ్యలివి. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమెక్కేది తెలుగుదేశం పార్టీయేననీ, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ఒక్క గంట కన్ను మూసుకుంటే, వైఎస్సార్సీపీ సంగతి తేల్చేస్తామని పరిటాల సునీత వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమే.. దాడులు కూడా సర్వసాధారణమైపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పరిటాల కుటుంబానికి ఇవన్నీ తెలియవా.? టీడీపీ అధికారంలో వున్నప్పుడు పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాలో సాగించిన రక్తచరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిటాల రవి బలైపోయిన మాట కూడా వాస్తవం.

ఎప్పుడో రెండున్నరేళ్ళ తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందో లేదో.. పరిటాల సునీత జోస్యం చెబితే ఎలా.? ఈలోగా పరిటాల సునీత ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, రానున్న రెండేళ్ళలో వైఎస్ జగన్ ఒక్క అరగంట కన్ను మూసుకున్నా, మిగతా వ్యవహారాన్ని వైసీపీ క్యాడర్ చక్కబెట్టేస్తుంది. నిజానికి, ఇలాంటి చర్చ దురదృష్టకరం. కానీ, నేతలు ఆ స్థాయికి దిగజారిపోయి వ్యాఖ్యానిస్తున్నారు కాబట్టే.. ఇలాంటి ప్రస్తావనలు వస్తున్నాయ్.

2019 ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి ఎందుకు పరాభవం ఎదురయ్యింది.? అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, పరిటాల కుటుంబాన్ని అయోమయంలో పడేయడం వల్లే కదా ఈ దుస్థితి. ఆ సమయంలో పరిటాల కుటుంబం, టీడీపీ అధినేత తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అధికారంలోకి వచ్చాక మెరుగైన పాలన అందిస్తామని చెప్పాలి తప్ప, మేం అధికారంలోకి వస్తే.. మీ అంతు చూస్తాం.. అని హెచ్చరించడమేంటి.? యధా చంద్రబాబు, తదా టీడీపీ నేతలన్నట్టు తయారైంది పరిస్థితి.