థియేటర్లలోకి సినిమాలొస్తున్నాయ్.. ప్రేక్షకులొస్తారా.?

ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి సినిమాలు వచ్చేస్తున్నాయ్. సినిమాలొస్తే సరిపోదు, ప్రేక్షకులు రావాలి. వస్తారు, నో డౌట్.. అంటోంది తెలుగు సినీ పరిశ్రమ. చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు తెలుగు సినీ ప్రముఖులు, కరోనా సెకెండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న కొత్త సినిమాల విషయమై. నిజానికి, ఇది చాలా రిస్కీ అటెంప్ట్ ఏ నిర్మాతకి అయినా. కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత కాస్త తగ్గిందంతే.. పూర్తిగా కరోనా వైరస్ మాయమైపోలేదు. తెలంగాణలో 700 కేసులకు అటూ ఇటూగా నమోదవుతున్నాయి ప్రతిరోజూ. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ లెక్క 2 వేలకు అటూ ఇటూగా వుంటోంది. మరెలా థియేటర్లకు ప్రేక్షకులు ధైర్యంగా వెళ్ళేది.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. పార్కుల్లో జనం పోటెత్తుతున్నారు.. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి.

దేవాలయాల్లో జనం సంగతి సరే సరి. సో, సినిమా థియేటర్లకీ జనం పోటెత్తే అవకాశాల్లేకపోలేదు. అయితే, చిన్న సినిమాలతో సినిమా థియేటర్లు తెరవాలన్న ప్రయోగం మరీ అంత మంచిది కాదు. ఎందుకంటే, తొలి రోజే థియేటర్లు వెలవెలబోతే.. ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. సగటుసినీ అభిమాని.. థియేటర్లకు పరుగులు పెట్టాలంటే పెద్ద సినిమా పడాల్సిందే. కానీ, అంత రిస్క్ చేసేందుకు ఏ పెద్ద నిర్మాతా ముందుకు వచ్చేలా లేడు ప్రస్తుతం. చిన్న సినిమాలతో ప్రయోగం చేసి, వర్కువట్ అయితే ఆ తర్వాత ఎటూ పెద్ద సినిమాల రిలీజ్ జరిగి తీరుతుంది. ఆగస్టు చివరి నాటికి పరిస్థితి పూర్తి కలర్‌ఫుల్‌గా వుంటుందనే అభిప్రాయం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.? కానీ, కరోనా మూడో వేవ్ భయాలు రోజురోజుకీ ముదిరి పాకాన పడుతున్నాయి. సినీ పరిశ్రమ మళ్ళీ కుదురుకుంటున్న తరుణంలో మూడో వేవ్ భయాలు ముదిరితే పరిస్థితేంటి.? షరామామూలే.. ఇంకోసారి థియేటర్ల మూత తప్పదు. కానీ, ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.