Minister Botsa : తగ్గేదే లే.! మూడు రాజధానులే తమ విధానమంటున్న మంత్రి బొత్స

 Minister Botsa : ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.! తమ పార్టీ విధానం మూడు రాజధానులేనని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం ఒకటే, వీలుని బట్టి మూడు రాజధానుల బిల్లుని సభలో ప్రవేశపెడ్తామంటూ బొత్స తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు సరే, అందులో ఒకటైన అమరావతి పరిస్థితేంటి.. అన్న ప్రశ్నకు మాత్రం బొత్స వద్ద సమాధానమే లేదు. అసలు రాష్ట్రానికి ప్రస్తుతం రాజధాని ఏది.? అనడిగినా బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పలేకపోతున్నారు. అమరావతిని మూడు రాజధానుల్లో ఒకటిగా పేర్కొంటున్నా, ఆ అమరావతిని రాజధానిగా గుర్తించేందుకు వైసీపీ ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. అక్కడే వస్తోంది అసలు సమస్య.
గతంలో ఓ సారి మూడు రాజధానుల బిల్లు పెట్టారు, దాన్ని చట్టంగా మార్చారు. కానీ, ఏం లాభం.? ఆ చట్టం చెల్లుబాటు కాలేదు. ఆ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. సీఆర్డీయే రద్దు చట్టాన్నీ ఉపసంహరించుకుంది. దానర్థం అమరావతిని రాజధానిగా గుర్తిస్తున్నట్లే కదా. దాన్ని ఒప్పుకోవడానికెందుకు అంత మొండి పట్టుదల.?
రాజధాని లేదా రాజధానులు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది రాష్ట్రం సొత్తు. ఎవరు అధికారంలో వున్నా, రాష్ట్రానికి కనీసం ఓ రాజధాని వుండి తీరాలి. ఆ రాజధాని నిర్మితమైతే ఆ తర్వాత మూడు కాకపోతే ముప్ఫయ్ మూడు కట్టుకోవచ్చు. ఒక్కదానికే దిక్కులేదాయె.. మరో రెండు రాజధానులెలా సాధ్యం.?
ప్రశ్నలు అవే, సమాధానాలు దొరకడంలేదాయె.! ఇంకెన్నాళ్ళీ అయోమయం.?