New Districts In Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాల జాతర: ఏమేం మారబోతున్నాయ్.?

New Districts In Andhra Pradesh : 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా 26 జిల్లాల రాష్ట్రం కాబోతోంది. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కారు ఇప్పటికే కీలక నిర్ణయం తీసేసుకుంది.

తాజాగా కొత్త జిల్లాల విషయమై క్యాబినెట్ తీర్మానం కూడా జరిగిపోయింది. ఆన్‌లైన్ ద్వారా మంత్రులకు కొత్త జిల్లాలకు సంబందించి సమాచారం ముఖ్యమంత్రి పంపారు. కొత్త జిల్లాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లయ్యింది కూడా.

ఆ ఫైల్ కాస్త ఆర్డినెన్స్ రూపంలో మారడానికి గవర్నర్ వద్దకు వెళ్ళిపోయింది. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్సు అమల్లోకి వచ్చేస్తుంది.
ఏప్రిల్ 4 ఉదయం 9 గంటల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటిస్తారట.

అప్పటినుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేస్తాయి. జిల్లాకో కలెక్టరేట్ వుంటుంది.. జిల్లా స్థాయి అధికారుల విభజన వంటి వ్యవహారాలపై ఇప్పటికే జగన్ సర్కారు కసరత్తులు పూర్తి చేసింది.

కొన్నాళ్ళపాటు ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి చిత్తూరు.. అని జిల్లాల్ని వ్యవహరించడం జరుగుతుంటుంది. ఆ తర్వాత ఆయా జిల్లాల పేర్లు అందరికీ అలవాటైపోతాయి. అయితే, కొత్త జిల్లాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా.? అంటే అదొక మిలియన్ డాలర్ల ప్రశ్న.

పరిపాలన ప్రజలకు మరింత చేరువవడానికి, అన్నీ వున్నా అభివృద్ధికి నోచుకోని కొన్ని చిన్న పట్టణాలు జిల్లా కేంద్రాలుగా అభివృద్ధి చెందడానికి కొత్త జిల్లాలు దోహదపడతాయి. కేంద్రం నుంచి ఆయా జిల్లాలకు వచ్చే నిధుల్లోనూ పెరుగుదల వుంటుందని అంచనా వేస్తున్నారు.

అంతా సజావుగా సాగేనా.? వివాదాలేమైనా తెరపైకొస్తాయా.? మూడు రాజధానుల వ్యవహారంలానే కొత్త జిల్లాల వ్యవహారం కూడా విఫల ప్రయోగంగా మిగిలిపోతుందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకి.