గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఒక ఎత్తైతే నారా లోకేష్ మంగళగిరిలో పరాజయం పొందడం చంద్రబాబుకు ఘోర అవమానం. కుమారుడిని కూడ గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అప్పుడే వైసీపీ నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపి గెలిపించకలేక దొంగ దారిలో మంత్రిని చేశారని విమర్శలు గుప్పించారు. ఆ విమర్శల నుండి తప్పించుకోవడానికి 2019 ఎన్నికల్లో అన్ని లెక్కలను బేరీజు వేసుకుని మంగళగిరి నుండి పోటీలో పెట్టారు. అయినా లెక్కలన్నీ తప్పి లోకేష్ ఓడిపోయారు. దీంతో పడరాని పాట్లన్నీ పడుతున్నారు చంద్రబాబు.
అందుజే ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఒక టార్గెట్ అయితే నారా లోకేష్ ను గెలిపించుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసమే ఇప్పటి నుండే లెక్కలు చూసుకుని నియోజకవర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. ఈసారి ఎన్నికల్లో ఆయన్ను మంగళగిరి నుండి కాకుండా వేరొక చోట నుండి బరిలోకి దింపాలని చూస్తున్నారట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లేదా పెదకూరపాడు నుండి బరిలోకి దింపాలని చూస్తున్నారు. గుంటూరు పశ్చిమంలో మద్దాలి గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన త్వరలో వైసీపీలో చేరుతారని అంటున్నారు. అందుకే ఆ స్థానాన్ని లోకేష్ కు కేటాయించాలని భావిస్తున్నారట.
అలాగే పెదకూరపాడు నియోజకవర్గం నుండి కూడ బరిలోకి దింపాలనే ఆలోచన ఉందట. ఎందుకంటే పెదకూరపాడులో కమ్మ సామాజికవర్గం ప్రాభవం బాగా ఎక్కువ. కానీ గత ఎన్నికల్లో కొమ్మాలపాటి శ్రీధర్ ఓడిపోయారు. ఆయనే ఇప్పుడు అక్కడ ఇంఛార్జ్. ఆయన కూడ నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దాన్ని లోకేష్ కు కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈమధ్య లోకేష్ కూడ కొంచెం పుంజుకున్నారు. ఈ పరిస్థితుల్లో మంచి నియోజకవర్గంలో పెడితే గెలుపు సులభమవుతుందని భావిస్తున్నారట ఆయన.