రూ. 20 లక్షల నగుదుకు నిప్పుపెట్టాడు.. అసలేం జరిగిందంటే !

మన దేశంలో అవినీతిపరులకు కొదవే లేదు. ఓవైపు వేల కొద్ది జీతాలు నెలా నెలా ఠంచనుగా తీసుకుంటున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానటం లేదు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. బాధ్యతగా చేయాల్సిన పనులకు కూడా ప్రజల నుంచి పైసలు దండుకుంటున్నారు. అయితే కొందరు అధికారులు ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఎన్నో ఘటనలను చూశాం.. చూస్తున్నాం. కొన్ని నెలల క్రితం కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఎమ్మార్వో స్థాయి అధికారులే అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే.

వంటింట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరీ రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేసిన భార్యాభర్తలు.. అసలేం జరిగిందంటే..

ఇదిలా ఉంటే.. తాజాగా రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. వివరాల్లోకెళితే.. ఓ కాంట్రాక్ట్ పనిని అప్పగించడం కోసం వ్యక్తి నుంచి తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ రూ. లక్ష లంచాన్ని డిమాండ్ చేశాడు.ఈ డబ్బును నేరుగా అతను తీసుకోకుండా.. తన అనుచరుడైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్‌ ద్వారా తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు వ్యక్తి వద్ద నుంచి పర్వత్ సింగ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించగా.. అసలు విషయాన్ని వెల్లడించాడు. దాంతో ఏసీబీ అధికారులు కల్పేష్ కుమార్ జైన్ ఇంటికి వెళ్లారు. ఏసీబీ అధికారుల రాకను పసిగట్టిన జైన్.. ఇంట్లి తలుపులు వేసుకుని లోపలివైపు తాళాలు వేసుకుని దాదాను రూ. 20 లక్షల కరెన్సీ నోట్లను కాల్చి వేశాడు. అధికారులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. అప్పటికే నోట్ల కట్టలు మంటల్లో తగులబడిపోవటాన్ని గుర్తించారు. కల్పేష్ కుమార్ జైన్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు.