Mohanbabu: ట్రోల్స్ చేసే వారికి మంచు ఫ్యామిలీ గట్టి వార్నింగ్…!

Mohanbabu: పద్మశ్రీ పురస్కార గ్రహీత, లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు, ఈ మధ్య ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఇటీవల విడుదలైన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ .. ఇలా ప్రతి అంశంలోనూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌, పోస్టులను తక్షణమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ట్రోలింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అయితే.. మంచు ఫ్యామిలీ కుటుంబీకుల మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.

మీమ్‌లు ఫన్నీగా ఉన్నప్పుడు మేము కూడా వాటిని ఆనందిస్తాము.. కానీ అవి అవమానకరంగా మారినప్పుడు మాత్రం సహించలేమన, ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోలు మా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ఓ టీమ్‌ని పెట్టుకున్నారని ఇటీవల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు హీరోలెవరో నాకు తెలుసు కానీ వారికి కాలమే సమాధానం చెబుతుందని మోహ‌న్ బాబు అనడం కొసమెరుపు. మా ఎన్నికల సమయంలోనూ మంచు విష్ణుపై అనేక ట్రోల్స్ వచ్చాయి.. కానీ ఫైనల్‌గా మాత్రం ఆయనే గెలిచి, అందరికీ సమాధానం చెప్పారు.