” బూతు కిట్టూ ” అంటూ ఏ‌బి‌ఎన్ ఆర్‌కే మీద విరుచుకుపడ్డ ఉండవల్లి శ్రీదేవి !

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గత కొన్నిరోజులుగా నిత్యం ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు ఆమె దళితురాలు కాదని, తరువాత పేకాట క్లబ్ ల విషయంలో, అలాగే తన అనుచరుడైన సందీప్ తో గొడవల విషయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, రెడ్డి సామాజిక వర్గాన్ని తిడుతూ ఉన్న ఆడియోస్, వైసీపీ నేతలను తిట్టిన ఆడియోస్ ఇలా నిత్యం ఎదో ఒక వివాదంలో శ్రీదేవి ఉంటున్నారు. టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన శ్రీదేవిపై ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు.

బూతు కిట్టూగా మారిన ఏ‌బి‌ఎన్ ఆర్‌కే

వైసీపీని విమర్శించడంలో ఏబీఎన్ రాధాకృష్ణ ముందు వరసలో ఉంటారు. వైసీపీ నాయకులకు సంబంధించిన లొసుగుల గురించి కాచుకు కూర్చొని ఉంటారు. అలాంటి సమయంలో ఉండవల్లి శ్రీదేవికి సంబంధించిన ఆడియో క్లిప్స్ దొరకడంతో వాటిని టీవీలో ప్రసారం చేశారు. ఇలా ప్రసారం చేయడంతో శ్రీదేవి స్పందించారు. తనకు సంబంధించిన విషయాలను తన అనుమతి లేకుండా ఎలా ప్రసారం చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై కుట్రతోనే రాధాకృష్ణ ఇలాంటి అసత్యాలను ప్రసారం చేస్తున్నారని, ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండానే అసత్యాలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. అలాగే రాధాకృష్ణకు బూతు కిట్టుగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ చేస్తున్న పనుల వల్లే అతన్ని బూతు కిట్టని ప్రజలను పిలుస్తున్నారని తెలిపారు.

ఆ ఆడియో క్లిప్స్ శ్రీదేవివి కాదా!!

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో శ్రీదేవి తన అనుచరుడైన సందీప్ తో మాట్లాడినట్టుగా రెడ్డి సామాజిక వర్గాన్ని తిడుతూ, వైసీపీలోని కొంతమంది నాయకులు దళితులను తొక్కేస్తున్నారనే ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శ్రీదేవి మాత్రం ఆ ఆడియో క్లిప్స్ తనవి కావని బలంగా చెప్తున్నారు. అసలు మొదటి నుండి శ్రీదేవికి సంబంధించిన విషయాలే ఇలా ఎందుకు బయటకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు. ఈ విషయాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.