Crime: దారుణం.. నిండు ప్రాణాన్నీ బలిగొన్న గోతులు..?

Crime: కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆ దంపతుల ప్రతి రూపానికి మరొక నాలుగు నెలల్లో పండంటి బిడ్డ జన్మించే మధురక్షణాలు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. విషయంలోకి వెళితే.. పద్మనాభం సింహాచలం, ఆనందపురం బీసీ కాలనీకి చెందిన కుప్పిలి అశోక్ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. తాజాగా అతను మధ్యాహ్నం సమయంలో ద్విచక్రవాహనంపై మద్ది నుంచి ఆనందపురం వెళ్తుండగా మద్ది కూడలి దాటిన వెంటనే విశాఖ డైరీ బల్క్ కూలింగ్ సెంటర్ సమీపంలో రోడ్డుపై ఉన్న గోతులను తప్పించే క్రమంలో అదుపుతప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

హెల్మెట్ ఉన్నప్పటికీ అంతర్గతంగా బలమైన గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భీమునిపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సిఐ వి శ్రీనివాసరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పలరాజు పేర్కొన్నారు. అతడి మరణవార్త తెలుసుకున్న అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.