Maruthi: నాతో సినిమా చేయవద్దని ప్రభాస్ కి చెప్పారు.. కానీ.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ మారుతి!

Maruthi: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. యువీ వంశీ ఒకరోజు వచ్చి నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తావా అని అడిగారు. అప్పుడు నేను గోపీచంద్ తో సినిమా చేస్తున్నాను. అలాంటి అవకాశం వస్తే నేనెందుకు చేయను అన్నాను. ముంబై వెళ్లి ప్రభాస్ ని కలిసాను. నా ప్రేమకథ చిత్రం, భలేభలే మొగాడివోయ్ సినిమాలకు ప్రభాస్ పిచ్చ ఫ్యాన్ అని చెప్పాడు. నాకు అలాంటి సినిమా కావాలి అన్నారు. నేను అండి అని పిలుస్తుంటే డార్లింగ్ అని పిలవమన్నారు. నా పక్కా కమర్షియల్ సినిమా ఫెయిల్ అయింది.

నాకు కమిట్ అయిన నిర్మాత పక్కకు తప్పుకున్నాడు. దాంతో ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయకూడదు అనుకున్నాను. వంశీకి ఫోన్ చేసి చెప్పాను. కానీ సాయంత్రం ప్రభాస్ ఫోన్ చేసి నేను చెప్పిన కథ బాగుంది అన్నారు. ఆయన నమ్ముతున్నాడు అని రెండు రోజులు ఆలోచించి సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్రభాస్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ లో కామెడీ ఎలా చేస్తాడు అని అందరికి డౌట్స్ ఉన్నాయి. మా ఇంట్లో కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్నావా అని అడిగారు. అందరూ ప్రభాస్ గారితో మారుతితో ఇప్పుడు సినిమా ఎందుకు అని అడిగేవాళ్లు. కానీ ఆయన నమ్మారు నన్ను. నిన్న రాత్రి 2 గంటలకు ప్రభాస్ ఫోన్ చేసి నాతో అరగంట మాట్లాడారు టీజర్, రెస్పాన్స్ గురించి. మీ మీమ్స్ అన్ని నేను ప్రభాస్ కి చూపిస్తాను. మీ కంటే వెయ్యి రెట్లు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సినిమా గురించి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతారు. ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. నేను, ప్రభాస్ కలిసి వింటేజ్ డార్లింగ్, బుజ్జిగాడు ని చూపిద్దామని ఫిక్స్ అయ్యాము. హీరోయిన్ తో రొమాన్స్ చేసి చాలా రోజులైంది బాహుబలి తర్వాత హీరోయిన్ తో కరెక్ట్ సీన్స్ పడలేదు సినిమాలో ఒక ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టమని ప్రభాస్ అడిగారు అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ మారుతి.