మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

రాయగడ లోని సొండి వీధికి చెందిన స్వాతి పాత్రో (15), అదే వీధికి చెందిన రాహుల్ కౌసల్య (26) లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే అప్పటికే రాహుల్ కి పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాహుల్ భార్య, కొడుకు గుణుపూర్ లోని తన అత్తవారింట్లో ఉంటున్నారు. ఇక తన ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రాహుల్ అదే వీధికి చెందిన స్వాతితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడు. పెళ్లి అయిన విషయాన్ని కూడా మర్చిపోయి స్వాతి అనే బాలికను ప్రేమించాడు. వారిద్దరూ ఒకరిపై మరొకరు ఇస్టాన్నీ పెంచుకుని పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు.

అయితే రాహుల్ కి అప్పటికే పెళ్ళి అవ్వడంతో, పెళ్లి అయిన వ్యక్తికి మళ్లీ అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు అని ఆ జంట అనుకున్నారు. దీనితో చనిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాహుల్ ఇంట్లో ఒక గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఎప్పటిలాగే ఉదయం ట్యూషన్ కి వెళ్లి కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో, కంగారు పడిన ఆ యువతి తల్లిదండ్రులు ట్యూషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి తమ కూతురు గురించి అడగగా తమ కూతురు ఇంటికి రాలేదని మాస్టారు చెప్పడంతో ఆందోళన చెందారు.

స్వాతి తల్లిదండ్రులు వెంటనే గ్రామస్తుల సమాచారం మేరకు అదే వీధిలోని రాహుల్ ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఫ్యాన్ కు వేలాడుతూ రాహుల్ స్వాతి కనిపించారు. అప్పటికే చనిపోయిన స్వాతిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన ఊపిరితో ఉన్న రాహుల్ ని ఆసుపత్రిలో చేర్పించగా అతను కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమజంట ఆత్మహత్య పై దర్యాప్తు చేపడుతున్నారు.