కేసీయార్, వైఎస్ జగన్ కలయికపై బీభత్సమైన ట్రోలింగ్.!

ఓ వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలుపుకోవడం, ఈ కలయిక సందర్భంగా ఇరువురి మధ్యా ముచ్చట్లు చోటు చేసుకోవడం.. ఇదంతా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్‌కి కారణమవుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల కారణంగా కేసీయార్ కావొచ్చు, వైఎస్ జగన్ కావొచ్చు.. కలిసి కూర్చుని, సమస్యకు పరిష్కారం వెతకలేకపోయారు. వాస్తవానికి, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామని పదే పదే ఏపీ ప్రభుత్వం చెప్పినా, తెలంగాణ ప్రభుత్వం తరఫున కీలక నేతలు ముందుకు రాలేదన్న విమర్శ వుంది.

సరే, రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితాలు వేరు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన వేడుకకు హాజరయ్యారు గనుక.. మర్యాదపూర్వకంగా కేసీయార్, వైఎస్ జగన్ పలకరించుకుని వుంటారు. కలిశారు గనుక, ముచ్చట్లు మామూలే.. అందులో రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయ్.

అయితే, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీయార్.. తమపై నడుస్తున్న ట్రోలింగ్ విషయమై ఒకింత ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదేమో. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత అవసరం. ఆ సఖ్యత చెడే సందర్భం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రులుగా వారి వారి బాధ్యతల్ని గుర్తెరిగి, సమస్య పరిష్కారం కోసం ఇరువురూ ఒకే వేదికపై కలిసి కూర్చుని చర్చించుకోవాలి.

కాగా, ఇరు రాష్ట్రాలకూ వారి వారి ప్రయోజనాలు ప్రత్యేకంగా వుంటాయనీ, ఈ నేపథ్యంలో చిన్నప్పటి స్పర్ధలు ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వాలు నడిపేవారి మధ్య వుంటే వుండొచ్చన్నది మరికొందరి వాదన.