Kapil Sharma: తాగిన మత్తులో ట్వీట్ చేశాడు… ఏకంగా తొమ్మిది లక్షలు పోగొట్టుకున్న నటుడు?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన సుమారు పాతిక సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ అందులో పదిహేను సంవత్సరాలపాటు బుల్లితెరపై వ్యాఖ్యాతగా విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే బాలీవుడ్ బుల్లితెరపై ది కపిల్ శర్మ షో ఎంతో ఆదరణ పొందిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా కపిల్ శర్మ వ్యాఖ్యాతగా సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కపిల్ శర్మ కొత్త షో ‘కపిల్ శర్మ: ఐయామ్ నాట్ డన్ ఎట్’ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా కపిల్ శర్మ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే తన జీవితంలో తాను చదువుకోవడం కోసం కూడా అంత డబ్బు ఖర్చు చేయలేదని కేవలం ఒకే ఒక ట్వీట్ చేసినందుకు లక్షల్లో ఖర్చు చేశానని ఆ సంఘటన గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాను మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు తెలిపారు. ఈ వెకేషన్ లో భాగంగా ఫుల్లుగా తాగి, తాగిన మత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశానని తెలిపారు.అయితే ఈ ట్వీట్ చేయగానే వెంటనే కంగారుపడిన కపిల్ శర్మ సరాసరి హోటల్ యాజమాన్యం దగ్గరకు వెళ్లి ఈ హోటల్ లో ఇంటర్నెట్ రాని గది కావాలని అడిగారట. అలా అడిగేసరికి యాజమాన్యం మీకు పెళ్లి అయ్యిందా! అని ప్రశ్నించగా అందుకు తాను ఇలా ట్వీట్ చేశానని చెప్పడంతో సిబ్బంది ఇంటర్నెట్ లేని గదిని చూపించారని తెలిపారు. ఇలా ఆ ఇంటర్నెట్ లేని గది కోసం ఎనిమిది రోజులకు సుమారు తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించానని నా భవిష్యత్తులో చదువు కోసం కూడా ఇంత ఖర్చు చేయలేదని ఈ సందర్భంగా గత అనుభవాన్ని కపిల్ శర్మ ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు.