యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్న అతికొద్దిమంది హీరోలలో ఒకరు. 2003 నాటికే తారక్ కెరీర్ లో స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి సినిమాలతో ఘన విజయాలు చేరాయి. ఒకవైపు బాబాయ్ బాలకృష్ణ వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటుండగా అబ్బాయ్ తారక్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
అయితే సింహాద్రి సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు సినిమాల ఫలితాలు ఎన్టీఆర్ కు వరుసగా షాకిచ్చాయి. కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఎన్టీఆర్ భావించిన సమయంలో బాలయ్యకు సమరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ ఇచ్చిన చెంగల వెంకట్రావు ఎన్టీఆర్ కు దుర్గి సినిమాను రీమేక్ చేద్దామని సూచించారు.
కన్నడలో దుర్గి సినిమా సక్సెస్ సాధించగా మాలాశ్రీ ఈ సినిమాలో మాస్ రోల్ లో నటించి మెప్పించారు. కన్నడలో మాలాశ్రీ చేసిన పాత్రను ఎన్టీఆర్ కు అనుగుణంగా మార్పులు చేసి బి.గోపాల్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కించారు. ఒక హీరోయిన్ గా సమీరా రెడ్డి మరో హీరోయిన్ గా అమీషా పటేల్ ఈ సినిమా కోసం ఎంపికయ్యారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో నిర్మాత చెంగల వెంకట్రావు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు విడుదలైన అతనొక్కడే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా నరసింహుడు సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. ఆ తర్వాత రోజుల్లో రాఖీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
