TDP : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ‘నవరత్నాలు’ ప్రకటించిన విషయం విదితమే. ఆ నవరత్నాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఎన్నికల్లో నవరత్నాల మంత్రం వర్కవుట్ అయ్యింది.. వైఎస్సార్సీపీకి అఖండ మెజార్టీ దక్కింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
నిజానికి, నవరత్నాలకు ధీటుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘పసుపు – కుంకుమ’ అనీ, ఇంకోటనీ.. హడావిడి చేసినా, ఎన్నికల్లో బోల్తాపడక తప్పలేదు. అయితే, ఈసారి పక్కాగా ‘పచ్చరత్నాలకు’ చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారట. పార్టీ ముఖ్య నేతలతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ‘పసుపు రత్నాల’ గురించి చంద్రబాబు హింట్ ఇచ్చేశారట.
జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని బలంగా నమ్ముతోన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అతి త్వరలోనే మేనిఫెస్టో రూపకల్పనకి శ్రీకారం చుట్టబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే తన పుత్రత్నం నారా లోకేష్కి దిశానిర్దేశం కూడా చేసేశారట.
అయితే, నవరత్నాల్ని మించి ఈ పసుపు రత్నాలు సంఖ్యా పరంగా, సంక్షేమం పరంగా వుంటాయా.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. టీడీపీలో జరుగుతున్న ఈ పసుపు రత్నాల ప్రచారంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట కూడా. పెట్టాలి మరి.. తప్పదు కదా.! చంద్రబాబు ప్రకటనకు ముందే, వైసీపీ ప్రభుత్వమే వాటిల్లో కొన్నిటిని అమలు చేసే అవకాశం వుంటుంది మరి.
ఏదిఏమైనా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ ఓటు బ్యాంకు యుద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది.. అదీ పూర్తిగా అప్పుల మీద ఆధారపడి.
