Crime News: వివాహ శుభకార్యంలో విషాదం… అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది మృతి!

Crime News: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా అటువంటి దయనీయమైన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి సందడి పూర్తికాకుండానే పెళ్లి జరిగిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుగవి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలలోకి వెళితే.. బళ్లారి లో వివాహానికి హాజరై తిరిగి అనంతపురం వెళుతుండగా ఉరవకొండ సమీపంలోని బుదగవి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెళ్లి బృందం వెళుతున్న ఇన్నోవా కార్ నీ లారీ నీ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొట్టడం వల్ల కారు ముందు భాగం బాగా దెబ్బతిని అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతిచెందిన వారందరూ నిమ్మ గళ్ళు వాసులుగా గుర్తించారు. ఒకేసారి ఊహించని విధంగా తొమ్మిది మంది మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ఈ ప్రమాద ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపు నుండి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.