దేశమంతా చాలా కాలంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల వరదల వలన పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగానే జరిగింది . రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజలు చాలా నష్టపోయారు. ప్రభుత్వాలు , అధికారుల మధ్య సమన్వయ లోపంతో నష్ట తీవ్రత ఎక్కువగా జరుగుతుంది. ఈ వర్షాల వలన జలాశయాలన్నీ నిండుకుండల మాదిరిగా కళకళలాడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. పలు ప్రాంతాల్లో రైతులు మాత్రం నష్టపోతున్నారు. రోజుల తరబడి నీళ్లు నిలవడంతో పంటపొలాలు దెబ్బతింటున్నాయి. ఇంకా పలు గ్రామాలు వరద నీటిలోనే మునిగిపోయాయి. ఐతే మరికొన్ని రోజుల పాటు ఈ వాన కష్టాలు తప్పేలా లేవు. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అంతేకాదు దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్టణం, క్రిష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబరు 8 వరకు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
.