First Pan India Film : ఇటీవల కన్నడ నిర్మాతలు కన్నడ సినిమాల్ని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువగా దక్షిణ భారత భాషలకే పరిమితమైనప్పటికీ, ‘K.G.F’ వంటి మెగా మూవీ విడుదలలు, మరికొన్ని ఇతర సినిమాలు ఇప్పుడు హిందీ చలనచిత్ర మార్కెట్లలోకి కూడా ప్రవేశించాయి. రాబోయే వారాల్లో విడుదల కానున్న అనేక కన్నడ సినిమాలని కనీసం మూడు భాషల్లోకి డబ్ చేస్తున్నారు. వీటిలో హిందీ ప్రముఖంగా వుంది. అయితే కన్నడకి సంబంధించినంతవరకూ ఇది ఏ విధంగానూ ఇప్పటి నవీన ధోరణి కాదు.
1950వ దశకంలోనే అనేక దక్షిణ భారత చలనచిత్రాలు సాంస్కృతిక సారూప్యతలు, సౌలభ్యాల కారణంగా, కనీసం రెండు భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యాయి. నిజానికి ఎనిమిది భాషల్లో డబ్బింగ్ చేసి విడుదలైన మొట్టమొదటి కన్నడ చిత్రం 1959 సంవత్సరం నాటిది. తెలుగు, హిందీ సహా ఎనిమిది భాషల్లో విడుదలైంది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది బీఎస్ రంగా నిర్మించిన ‘మహిషాసుర మర్దిని’ – అనే పౌరాణిక పురాణ చలన చిత్రం గురించి. ఇందులో డా.రాజ్కుమార్, వి. నాగయ్య, ఉదయ్కుమార్, కె.ఎస్. అశ్వత్ ఇంకా అనేక ఇతర దిగ్గజ నటులు నటించారు . ‘మహిషాసుర మర్దిని’ ఒక సాంస్కృతిక విజయం. కన్నడ సినిమాని జాతీయ స్థాయిలో పరిచయం చేసింది. ఈ లెక్కన దీనిని మొట్టమొదటి పానిండియా మూవీగా సినిమా చరిత్రకారులు పరిగణిస్తున్నారు.
