జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన శాసన సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జార్ఖండ్ గవర్నర్కి కూడా సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారా.? అన్నది సస్పెన్స్గా మారింది.
గనుల కేటాయింపుకి సంబంధించి జార్ఖండ్ సీఎంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా వున్న హేమంత్ సోరెన్, తనకు తానుగా గనుల కేటాయింపు జరుపుకున్నారనీ, ఇది అనైతికమనీ, నిబంధనలకు విరుద్ధమనీ ఫిర్యాదులు అందడంతో, ఫిర్యాదులను స్వీకరించి, విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
కాగా, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపైనా, కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపైనా హేమంత్ సోరెన్ మద్దతుదారులు మండిపడుతున్నారు. జేఎంఎం నేతలు జార్ఖండ్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం జార్ఖండ్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న హేమంత్ సోరెన్, ఆ పర్యటనకు బ్రేక్ ఇచ్చి, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారట. శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన దరిమిలా, ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావొచ్చు.
ఇదిలా వుంటే, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కోర్టును ఆశ్రయించేందుకు హేమంత్ సోరెన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, తెలుగు రాజకీయాల్లోనూ బీజేపీ ఇవే తరహా రాజకీయాలు చేయొచ్చన్న చర్చ తెలుగునాట ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతో, తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకూ అనర్హత ప్రమాదం పొంచి వుందా.? అన్న అనుమానాలైతే తెరపైకి బలంగా వస్తున్నాయ్.
