దారుణం.. తల్లిదండ్రులు మందలించారని క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్న కూతురు..!

ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి సరదాల కోసం అంటూ వారిని ఇష్టానుసారంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అనంతరం కొన్ని సందర్భాలలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పిల్లలు దానిని భరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అమ్మాయిలు ఎక్కువ శాతం ఉండటం గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాణిపేట జిల్లా చిప్కోట్‌లో జరిగింది. ఈ ప్రాంతంలో గణపతి, అతని భార్య మహేశ్వరి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా చిన్నమ్మాయి 12వ తరగతి చదువుతోంది. అయితే గత కొద్దిరోజుల నుంచి చదువుపై నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో తల్లిదండ్రులు ఈ విషయంపై తనను గట్టిగా మందలించారు. చదువుపై కాకుండా ఇతర విషయాలపై శ్రద్ధ చూపుతూ ఉండడంతో చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు తమ కూతురిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి కటినమైన నిర్ణయాన్ని తీసుకుంది.

కేవలం తల్లిదండ్రులు మందలించారని కోపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. తన భవిష్యత్తు కోసం తనని మండలిస్తే ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిందని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.