కరోనా సునామీ.. అయినా ‘లాక్ డౌన్’ ఎందుకు పెట్టడంలేదు.?

Covid 19 Tsunami: Why No Lockdown Now?

Covid 19 Tsunami: Why No Lockdown Now?

దేశంపైకి కరోనా వైరస్ (కోవిడ్ 19).. సునామీలా దండెత్తుతోంది. నిన్న ఒక్క రోజే లక్షా పదిహేను వేల కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర వాటానే 55 వేల కేసుల పైన వుంది. అసలు సిసలు వేవ్ అతి త్వరలో.. ఏప్రిల్ నెలాఖరు నాటికి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారబోతోంది. ఇవన్నీ కేంద్రం చేస్తున్న హెచ్చరికలే. నిజానికి, లక్ష కేసులు దాటడం అనేదే సరికొత్త రికార్డ్. అలాంటప్పుడు, మరింత ప్రమాదకర పరిస్థితి.. అంటే, అది ఐదు లక్షలా.? పది లక్షలా.? పాతిక లక్షల రోజువారీ కేసుల వ్యవహారమా.? అన్న ఆందోలన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడమొక్కటే మనముందున్న తక్షణ కర్తవ్యమని కేంద్రం చెబుతోంది. కరోనా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్నప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో తొందర ఎంతవరకు సమంజసం.? అన్న వాదనా లేకపోలేదు.

రెండు డోసులు తీసుకున్నప్పటికీ సినీ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. తొలి డోస్ తీసుకున్న తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కరోనా బారిన పడిన విషయం విదితమే. మరి, ఈ మహమ్మారిని అడ్డుకునేదెలా.? నిజానికి, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ప్రమాదకర స్థాయికి వెళ్ళబోతున్నాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో తాత్కాలికంగా అయినా లాక్ డౌన్ ప్రకటించి వుండాల్సింది. జనం ఎక్కువగా గుమికూడే పొలిటికల్ మీటింగులు, ఆద్మాత్మిక కార్యక్రమాలు, సినిమా థియేటర్లు, వినోద కేంద్రాల విషయంలో ఆంక్షలు విధించి వుండాల్సింది. అవేవీ చేయకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పాజిటివ్ కేసులే కాదు, మరణాలూ అనూహ్యంగా పెరుగుతున్న దరిమిలా, కేంద్రం.. దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి వుంది.