AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. పొత్తు పెట్టుకుని తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీలు కలిసి 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాయి అయితే ఈ పోటీలో భాగంగా కూటమి పార్టీలు అద్భుతమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది అయితే ఈ ఏడు నెలల కాలం పాటు ఎంతో సవ్యంగా సాగిపోతున్న కూటమి పార్టీలలో భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తెరపైకి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనే వాదన కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ విషయం గురించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపే ప్రయత్నం జరుగుతోందంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు కారణం అవుతున్నాయి.
భారతదేశ రాజ్యంగ పరిరక్షణను కాంగ్రెస్ ప్రాథమిక బాధ్యతగా తీసుకున్నదని, రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ మరోసారి స్వార్థపూరితమైన రాజకీయాలను చేస్తోందని ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని గిల్లిగజ్జాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని, చంద్రబాబును కుర్చీలో నుంచి దింపే ప్రయత్నం జరుగుతోందని దయాకర్ వెల్లడించారు.
చంద్రబాబుతో కయ్యం పెట్టుకుంటే తమ ప్రభుత్వానికి ప్రమాదం అని తెలిసిన ఎన్ డి ఏ మాత్రం పవన్ కళ్యాణ్తో బీజేపీ ముందుకు వెళ్లిందని, బాబుని పక్కకు తొయ్యాలనే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇలా చంద్రబాబు నాయుడు పదవికే ఏసరు పెట్టారు అన్న ఉద్దేశంతో అద్దంకి దయాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి చర్చలకు కారణం అవుతున్నాయి.