ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. కేవలం 48 గంటల వ్యవధిలో ‘వెలిగొండ’, ‘పోలవరం ఎడమ కాలువ’ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ మహా జలయజ్ఞం వెనుక అమరావతి సచివాలయంలో ఒక రేంజ్ ప్రొటోకాల్ కామెడీ నడిచిందనే పచ్చి నిజం తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో బయటపడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రాత్రింబవళ్లు శ్రమించి ప్రాజెక్టులు పూర్తి చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఫోటోను.. సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు పత్రికా ప్రకటనలు, ఫ్లెక్సీల నుంచి ‘గుట్టుచప్పుడు’ కాకుండా లేపేసారు.
ప్రభుత్వ అఫీషియల్ యాడ్స్లో ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ ల ఫోటోలే తప్ప.. అసలు సిసలు ఇరిగేషన్ మంత్రి నిమ్మల ఫోటో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఓ రేంజ్ వెటకారానికి దారితీసింది. ఈ ‘ఫోటో మిస్సింగ్’ ఎపిసోడ్పై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ విభాగాల మధ్య ఉన్న ‘సమన్వయ లోపం’ వల్లే ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు లేకపోవడం ఏంటని, తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్లాస్ పీకారు. నిజానికి, నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ‘సకల శాఖా మంత్రి’లా అన్ని చోట్లా తానే కనిపించేవారని విమర్శించిన కూటమి నేతలకు.. ఇప్పుడు తమ ప్రభుత్వంలో కూడా ఐటీ మంత్రి లోకేష్ ప్రమేయం పెరిగి ఇరిగేషన్ మంత్రికి కనీసం ‘యాడ్స్’ లో కూడా ప్లేస్ దక్కకపోవడం గమనార్హం. అధికారులు కావాలనే చిన్నబాబు భజనలో పడి నిమ్మలను లైట్ తీసుకున్నారా.. లేక కూటమిలో మంత్రులంతా కేవలం ‘డమ్మీలు’ అని హింట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.