Sree Lakshmi: చంద్ర మోహన్ చాలా డేంజర్…జాగ్రత్తగా ఉండాలి.. నటి శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్!

Sree Lakshmi: చంద్ర మోహన్ గారితో చాలా డేంజర్ అని సినీ నటి శ్రీ లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వెనకాల ఉన్నాడంటే మనం చాలా అలర్ట్‌గా ఉండాలని, చెవి మీద ఫట్‌మని కొట్టేస్తాడని ఆమె చెప్పారు. ఆ తర్వాత మళ్లీ నాకేం తెలియదన్నట్టు వెళ్లిపోతాడంటూ ఆమె అన్నారు. కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదని ఆమె తెలిపారు. అలా ఆయనతో ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఫేస్ చేశానని ఆమె చెప్పారు.

ఇకపోతే షాట్ చేయడం లేదు అని జంధ్యాల గారు అరుస్తూ ఉంటే కౌంటర్ ఇవ్వడానికి కూడా తమకు అంత ధైర్యం లేదని శ్రీ లక్ష్మీ అన్నారు. ఆయన మాత్రం తిట్టి మరీ తమకు డైలాగ్‌లు నేర్పించారని, ఈ రోజు ఇలా బతుకుతున్నానంటే కారణం ఆయన దీవెనలే అని ఆమె చెప్పారు. అయితే సూత్రధారి అనే సినిమాలో 30 రోజుల్లో అన్ని భాషలు అనే సీన్లో అక్కినేని గారు పరీక్షలా… బాగా చదువు.. బాగా చదువు అంటూ వెటకారంగా మాట్లాడుతూ వెళ్లిపోయేవారని ఆమె నవ్వుతూ చెప్పారు.

తాను అక్కినేని నాగేశ్వర్ రావు గారితో చాలా సినిమాలు చేశానన్న శ్రీలక్ష్మీ, ఎన్టీఆర్‌తో మాత్రం చేయలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుందని ఆమె వాపోయారు. ఎందుకంటే ఆయన తాను వచ్చేటప్పటికే రాజకీయాల్లోకి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. ఆయనతో కలిసి సింహం నవ్వింది అనే ఒక్క సినిమాలోనే చేశానని, ఆయన మామూలుగా అనే మాటలకే తనకు భయం వేసేదని ఆమె సరదాగా అన్నారు. అదే నాగేశ్వర్ రావు గారితో మాత్రం చాలా ఫ్రీగా మాట్లాడేదాన్ని అని ఆమె చెప్పారు.

అయితే ఒకసారి సెట్లో ఉండగానే టిఫిన్ చేస్తున్నపుడు నాగేశ్వర్ రావు గారు వచ్చి అన్న మాటలకు తనకు చాలా భయమేసింది శ్రీలక్ష్మీ చెప్పారు. అప్పుడు ఆయన వచ్చి ఒకతన్ని చూపిస్తూ చూడమ్మా ఎలా తింటున్నారో వాళ్లు.. సాధారణంగానే కొన్ని రకాల టిఫిన్లు వాళ్లు పెడతారు. ఎందుకంటే ఒకటి తినలేను అనుకున్నవారు ఇంకోటి తినొచ్చనే కారణంతో. కానీ వాడు చూడు అలా ప్లేట్‌లో అన్నీ పెట్టేసుకున్నాడు అనేసరికి, తాను మరో మాట కూడా మాట్లాడలేదని ఆమె చెప్పారు. మరొక రోజైతే తాను పెరుగన్నం తింటున్నపుడు వచ్చి, పెరుగన్నంలో ఎన్ని బ్యాక్టీరియాలుంటాయో తెలుసా.. అన్నీ పురుగులు.. పురుగులు అని అనేసరికి తాను మరో మాట లేకుండా ప్లేట్ పక్కన పెట్టేశానని ఆమె నవ్వుతూ చెప్పారు.