కమలం.. గులాబీ.. కలిసి ఆడుతున్న నాటకమే ఇది.?

డబ్బులు ఎర చూపిందెవరు.? ఆ విషయాన్ని బయటపెట్టిందెవరు.? అసలు మొత్తంగా నాటకం ఆడుతున్నదెవరు.? హైద్రాబాద్ శివార్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం జరిగిందంటూ నడుస్తున్న కథలో సూత్రధారులు, పాత్రధారులకు సంబంధించి ఎందుకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నిందితుల రిమాండ్ న్యాయస్థానం తిరస్కరించిందంటేనే.. ఈ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినట్లు. ‘అధికార పార్టీ చెప్పినట్టల్లా పోలీసులు ఆడుతున్నారు..’ అనే విమర్శని హైద్రాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుర్కోవాల్సి వస్తోంది విపక్షాల నుంచి.

డబ్బలు ఎంత దొరికాయన్నదానిపై మొదటి రోజే స్పష్టత లేదు. రిమాండ్ రిపోర్టులో ఆ విషయాన్ని అసలు ప్రస్తావించనే లేదు. సో, ఈ కేసు నిలబడే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెబుతున్నారు. ‘అసలు మాకు సంబంధం లేదు..’ అని నిన్న చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడేమో ‘అయితే తప్పేంటి.?’ అంటున్నారు.

ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. వ్యవహారం మొత్తం టీఆర్ఎస్ – బీజేపీ మధ్యనే నడుస్తోంది. ఈ సందట్లో కాంగ్రెస్ హంగామా అసలు కనిపించడంలేదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర అసలు చర్చనీయాంశమే కావడంలేదు. మునుగోడు ఉప ఎన్నిక గురించి కూడా ఎవరూ పట్టించుకోవడంలేదిప్పుడు.

ఇదంతా చూస్తంటో బీజేపీ – టీఆర్ఎస్ కలిసి ఆడిన డ్రామాగా మాత్రమే ఈ వ్యవహారం మొత్తాన్నీ చూడాలేమో. అధికార పార్టీ ఎమ్మెల్యేలను లాగాలంటే, అదెలా చెయ్యాలో బీజేపీకి తెలియదా.? ఎన్నో రాష్ట్రాల్లో అలాంటి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది బీజేపీ.
ఎలా చూసినా.. ఈ డ్రామా వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పన్నిన వ్యూహం వుందనే భావించాల్సి వస్తుంది.