సాధినేని యామినీ మ్యాటర్ లో జగన్ మీద బీజేపీ సీరియస్ !

Somu Veerraju

టీడీపీ నేతగా ఉన్న సాధినేని యమిని ఇప్పుడు బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆమె తన వాగ్దాటితో వైసీపీ నాయకులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిన తరువాత కూడా యామిని వైసీపీని తర్జర్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీటీడీ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెకు కష్టాలు తెచ్చాయి. అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు. యామినిపై కేసు నమోదు చేయడాన్ని బీజేపీ నాయకులు తప్పు పడుతున్నారు.

తాజాగా ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు కూడా స్పందించారు. శతాబ్దాల కల.. అయోధ్యలోని రామాలయం శంకుస్థాపన. ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపథ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీలో ప్రచారం చేయకపోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం. దీనిపై బీజేపీలో వున్న అనేక మంది ప్రస్తావించారు. యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు. ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

టీటీడీ రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవడాన్ని తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది నాయకులు తప్పు పట్టారు. ఈ విషయంపై అప్పట్లో టీటీడీ అధికారులు కూడా స్పందించి వివరణ ఇచ్చారు. రామ మందిర భూమి పూజ సమయానికి శ్రీవారికి సంబంధించిన మరో కార్యక్రమం ఉన్నందున ఆ కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. టీటీడీపై అప్పుడు చాలామంది నేతలు విమర్శలు చేసినప్పటికీ యామిని మీదనే ఎందుకు కేసు పెట్టారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. యామినిపై కేసు పెట్టడంతో బీజేపీ నాయకులు జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.