ఏపీ మాజీమంత్రి ‘పట్నం సుబ్బయ్య’ హఠాన్మరణం !

ఏపీ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత పట్నం సుబ్బయ్య అనారోగ్యం కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఐరాల మండలంలోని కొత్తపల్లిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది కాలం క్రితం ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. పలమనేరులో ప్రభుత్వ డాక్టర్‌ గా పని చేసిన సుబ్బయ్య, ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Former AP minister Patnam Subbaiah dead

టీడీపీ హయాంలో ఆయన పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక.. పట్నం సుబ్బయ్య ప్రాధాన్యం క్రమంగా తగ్గింది. నాలుగోసారి పట్నం సుబ్బయకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. పలమనేరు అభ్యర్థిగా లలిత కుమారికి అవకాశం ఇచ్చారు. దీంతో పట్నం సుబ్బయ్య రాజకీయ జీవితం ముగిసింది.

2014లో సుబ్బయ్య బీజేపీలో చేరారు. పార్టీ ఆయనకు రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం ఇచ్చింది. కానీ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఆయన మళ్లీ కమలం గూటికి చేరారు.రెండు సార్లు మంత్రిగా పనిచేసిన సుబయ్య.. సాధారణ జీవితం గడిపారు. ఒకప్పుడు మంత్రి హోదాలో ఉన్న ఆయన.. అనంతరం స్కూటర్‌పై తిరిగేవారు. పట్నం సుబ్బయ్య మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.