Amaravati Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్ర ఏం సాధించిందంటే.!

Amaravati Padayatra : అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన మహా పాదయాత్ర తిరుపతిలో ముగిసింది. ముగింపు నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించనుంది అమరావతి పరిరక్షణ సమితి.. ఇందుకు తిరుపతి వేదిక కానుంది. పాదయాత్రకు ఎలాగైతే పోలీసులు అనుమతి నిరాకరించారో, బహిరంగ సభకీ అలాగే అనుమతి నిరాకరణ ఎదురయ్యింది. కానీ, కోర్టును ఆశ్రయించి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నట్లే, బహిరంగ సభకీ అనుమతి తెచ్చుకున్నారు రైతులు.

ఇంతకీ, అమరావతి రైతులు మహా పాదయాత్ర ద్వారా సాధించిందేంటి.? అంటే, ఆ పాదయాత్ర కారణంగానే వైఎస్ జగన్ సర్కార్, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. సో, మహా పాదయాత్ర అత్యద్భుత విజయాన్ని అందుకున్నట్టే భావించాలి. అయితే, వికేంద్రీకరణ విషయమై మరో కొత్త బిల్లు తీసుకొస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దరిమిలా, రైతులు ఇంకో సంగ్రామానికి సిద్ధమవ్వాల్సిందేనేమో.

కాగా, రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఈ రైతుల మహా పాదయాత్రను అత్యంత ఖరీదైన పాదయాత్రగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర జరుగుతున్నప్పుడు, వివిధ వర్గాల నుంచి పెద్దయెత్తున విరాళాలు అమరావతి పరిరక్షణ సమతికి అందాయి. ప్రధానంగా టీడీపీ మద్దతుదారులే పెద్దయెత్తున విరాళాలు అందించడం గమనార్హం.

రైతుల పాదయాత్ర వెంట, వారు రాత్రి వేళ సేద తీరేందుకు మంచాలు తదితర ఏర్పాట్లతో కూడిన వాహనాలు వెళ్ళడం సహా చాలా అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పాదయాత్రల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయానుకోండి.. అది వేరే సంగతి.

ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి రైతుల మహా పాదయాత్ర అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. మరి, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్.. అన్నట్టుగా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారు, త్వరలో షాక్ ఇవ్వబోతోందా.? వేచి చూడాల్సిందే.