ఉన్న చంద్రబాబు వేస్ట్.. రాబోయే జగన్ బెస్ట్.. లాజిక్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ అనేది అత్యంత కీలకమైన అంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత దక్కింది అనే కూటమి నేతల సంబరాల నడుమ జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ పైనా, దానివల్ల కలిగే ప్రయోజనాలపైనా, అమరావతి నిర్మాణంతో పోలిస్తే దానికి అయ్యే అతి తక్కువ ఖర్చుపైనా చర్చ మొదలైంది.

దీనిపై ఇప్పటికే తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు… ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు వేస్ట్ అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించిందని అంటున్నారు పరిశీలకులు.

ఈ సందర్భంగా అసలు మావిగన్ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఏమన్నారంటే… జ‌గ‌న్ మావిగన్ వ్యాఖ్యలతో పెట్టుబ‌డుదారులు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి భ‌య‌ప‌డుతార‌ని.. ఈ తరహా హెచ్చరిక ఇప్పటికే పెట్టుబడిదారుల్లోకి వెళ్లిపోయిందని.. దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు.

కాసేపు అదే నిజమని అనుకుంటే… మరి తనను చూసే అమరావతికి పెట్టుబడులు వస్తాయంటూ చెప్పుకునే చంద్ర‌బాబు మార్క్ బ్రాండ్ సంగ‌తేంటి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

అంటే చంద్రబాబు తన గురించి తాన బ్రాండ్ గురించి చెప్పుకున్నవి.. ఓ వర్గం మీడియా అచ్చేసినవి.. లోకేష్ లాంటి యువ నేతలు చెప్పుకున్నవి అన్నీ అవాస్తవాలేనా..? అనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే… “వైఎస్ జగన్ మళ్లీ వస్తే..?” అనే ప్రశ్నను ముందు పెట్టి… “ప్రస్తుతం ఉన్న చంద్రబాబు బ్రాండ్” ని బద్నాం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు ఏబీ వెంకటేశ్వర రావు అని అంటున్నారు కొంతమంది తమ్ముళ్లు!

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… అమరావతికి ఈ మూడేళ్లలోనూ ఎలాంటి పెట్టుబడులు రాకపోయినా.. ఎలాంటి అభివృద్ధీ జరగకపోయినా.. గతంలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ స్థానంలో ఏఐ వీడియోలు చూపించాల్సిన పరిస్థితి వచ్చినా.. అందుకు కారణం జగన్ తీసుకొచ్చిన మావిగన్ అంశమే అని చెప్పి తమ చేతకానితనాన్ని ఒప్పుకుంటూనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన సైతం ఇప్పటి నుంచే టీడీపీ నేతలు చేయాలని ఏబీవీ కోరుకుంటున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

చంద్రబాబు చెప్పారనో.. భజన బృందం వాయించిందనో.. బాకా ఛానళ్లు ఉదాయనో.. కర పత్రాలు అచ్చేశాయనో కాకుండా… కేవలం లక్ష ఎకరాల్లో తాము, తమవారు కొన్న భూముల మధ్యనే అమరావతి రాజధాని ఉండాలని.. అందుకు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం అయినా వృథా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే మాటలకు పెట్టుబడి దారులైనా, సామాన్యులైనా విలువ ఇస్తారా..? ఆ మాటలను అసలు పరిగణలోకి తీసుకుంటారా..? అందుకేగా అమరావతికి పెట్టుబడులు రానిది..? ఆఖరికి హెరిటేజ్ సైతం తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నది..?

అంటే… చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం,  రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త వ‌చ్చింద‌నే ధీమా.. పెట్టుబడి దారుల్లో ఉంటే.. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంటి..?

వాస్తవం ఏమిటంటే… చంద్రబాబు మళ్లీ వస్తారా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డం ద్వారా రైతులను మురిపించగలిగారు తప్ప పారిశ్రామిక‌వేత్త‌ల్లో విశ్వాసం క‌లిగించ‌లేక‌పోయారన్నమాట.

ఈ వివరాలు సరిగ్గా చెప్పలేకో.. చంద్రబాబును పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదని అంగీకరించలేకో.. అమరావతి కంటే జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ కే ప్రజామద్ధతు రోజు రోజుకీ పెరుగుతుందన్న నిజాన్ని ఒప్పుకోలేకో.. పారిశ్రామికవేత్తలను జగన్ భయపెడుతున్నారంటూ ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సెల్ఫ్ గోల్ అని ఒకరంటే.. ఆత్మవంచన అని మరికొందరు అంటున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా… ఈ మూడేళ్లలో రైతులు ఆశించిన, ప్రజలు కోరుకున్నారని చెబుతున్న అమరావతికి ఓ రూపం రానిపక్షంలో… కూటమి ప్రభుత్వ పరిస్థితి… శంకరగిరి మాన్యాలే అని చెప్పినా అతిశయోక్తి కాదేమో!