టీడీపీ సానుభూతిపరుల అరెస్ట్.. ఆరోపణ పెద్దదే 

నేతల అరెస్టులతో గరం గరంగా ఉన్న టీడీపీ సానుభూతిపరుల అరెస్టులతో మరింత ఉడికిపోతోంది.  ఈరోజు తెల్లవారుఝామున టీడీపీ కార్యకర్తలు కృష్ణ, కిషోర్ లను సీఐడీ అరెస్ట్ చేసింది.  దీంతో తెలుగు దేశం అగ్రనాయకత్వం అలర్ట్ అయింది.  ఎప్పటిలాగే మావాళ్లు అమాయకులు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు.  నారా లోకేష్ అయితేవైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి,ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి,ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి,విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి,మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి అన్నారు. 
 
 
అంతటితో ఆగకుండా మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి.  రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు వైఎస్ జగన్ గారు.  భావప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు ?  ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు.  కృష్ణ,కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా ? అంటూ ఫైర్ అయ్యారు. 
 
 
మరోవైపు వైకాపా శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ, నేతల పరువుకు భంగం కలిగేలా పోస్టులు పెట్టారనే కారణంగానే వారిద్దరూ అరెస్టయ్యారని వాదిస్తున్నారు.  అంతేకాదు వాట్సాప్ లో వైసీపీ కార్యకర్త, జగన్ వీరాభిమానిగా పేరున్న గెడ్డెం ఉమా మీద అనుచిత సందేశాలు పెట్టినందుకుగాను గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ అరెస్టయ్యారని ఎవో వాట్సాప్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.  వాటిలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి పేరు కూడా ప్రస్తావనలో ఉంది.  ఈ ఆరోపణల మీదే వారిద్దరినీ సీఐడీ అరెస్ట్ చేసి ఉంటే వారు తీవ్ర ఆరోపణలను, విచారణను ఎదుర్కోవడం ఖాయం.