కష్ట కాలంలో ఈ రూ.500 కోట్ల ఖర్చు అవసరమా కేసీఆర్ సారూ 

KCR
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో ఇప్పటికే తీవ్ర విమర్శకు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  సామాన్య ప్రజానీకం నుండి న్యాయస్థానం వరకూ అందరూ కేసీఆర్ సర్కాట్ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు.  కరోనా నిర్థారణ పరీక్షలు చేయడంలో అలసత్వం, వైరస్ సోకిన వారికి సరైన వైద్య సదుపాయాల కల్పనలో వైఫల్యం, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో బయటపడుతున్న లోపాలు, వైద్యుల పట్ల నిర్లక్ష్యం ఇలా అనేక విమర్శలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి.  అసలు ప్రభుత్వం కరోనా నియంత్రణకు తగినన్ని నిధులు ఖర్చు పెట్టడం లేదని, అసలు ప్రభుత్వం వద్ద నిధులు లేవనే విమర్శ కూడా ఉంది. 
 
 
కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ ధనిక రాష్ట్రమని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు.  సరే ధనిక రాష్ట్రమే అయితే మరి నివారణ చర్యల్లో లోపం ఎందుకని, ఉద్యోగులకు అర జీతాలు ఏమిటని అడుగుతున్నారు.  ఇలాంటి సమయంలోనే కేసీఆర్ రూ.500 కోట్లు పెట్టి కొత్త సచివాలయ భవనం కట్టడానికి పూనుకున్నారు.  ఇప్పటికే పాత భవనాన్ని కూలుస్తున్నారు.  కోర్టు ఆపమని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా రేపో మాపో పూర్తిగా కూల్చడం, కొత్త భవనానికి శంఖుస్థాపన చేయడం జరిగిపోతాయి.   ఇవన్నీ చూస్తున్న జనం ఈ కష్ట కాలంలో ఇంత ఖర్చు అవసరమా అంటున్నారు. 
 
 
నిజమే మరి.. గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సరిగా లేవు.  వెంటిలెటర్లు, ఆక్సీజన్ సిలిండర్లు లేక ప్రాణాలు పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.  హైదరాబాద్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఇప్పుడున్న వైద్య సౌకర్యాలకు రెట్టింపు సౌకర్యాలు, మందులు, వైద్యులు, పరికరాలు, భవనాలు అవసరమవుతాయి.  వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.  కాబట్టి అత్యవసరం కాని విషయాలకు ఖర్చు పెట్టడం ఆపి వైడ్యరంగానికి ఎంత ఎక్కువ నిధులు కేటాయిస్తే అంత మంచిది.  ఇప్పుడు కొత్త సచివాలయానికి కేటాయిస్తున్న రూ.500 కోట్లను వైద్య సదుపాయాల కల్పనకు వాడుకుంటే మంచిది.  ఆ తర్వాత నిదానంగా సెక్రటేరియట్ కట్టుకోవచ్చు.  జనం కూడా ఇదే మాట చెబుతున్నారు.