సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంస్థ వైవిధ్యమైన చిత్రాలు అందించే ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌కు నా థ్యాంక్స్‌. ఆయన నాపై చూపించిన ప్రేమ మరువలేనిది. ఆయనతో నా స్నేహాన్నిఎప్పటికి కొనసాగించాలనుకుంటున్నాను. ఈ చిత్రానికి సుకుమార్‌ గారు స్క్రీన్‌ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ఈ చిత్ర నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది. ఈ చిత్రంతో దర్శకుడు కార్తిక్‌ దండును అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ చిత్రం అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకవెళుతుంది’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘.1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్‌డ్‌ విలేజ్‌లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా వుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఎంతో రిచ్‌గా చిత్రాన్ని రూపొందించారు. సుకుమార్‌ లాంటి గొప్ప దర్శకుడు నా చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి ధరమ్‌తేజ్‌ యాక్సిండెంట్‌ నుంచి కోలుకున్న తరువాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రంలో అందరూ కొత్త సాయిధరమ్‌ తేజ్‌ను చూస్తారు. ఈ చిత్రం అందరూ తప్పకుండా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా’ అన్నారు. ఎస్వీసీసీ లాంటి గొప్ప బ్యానర్‌లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని, తప్పకుండా అందరూ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన గొప్ప సినిమా ఇదని ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాగేంద్ర తెలిపారు. తెలుగులో రాబోతున్న మరో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సినిమా ‘విరూపాక్ష’ అని, ఈ చిత్రం కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వడం లేదని కెమెరామెన్‌ శ్యామ్‌దత్‌ తెలిపారు.

సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ మాట్లాడుతూ ‘సంగీతాన్ని మాట ల్లోవర్ణించలేము. మ్యూజిక్‌తోనే నా భావాన్ని వ్యక్తపరుస్తాను. సాయిధరమ్‌తేజ్‌తో మంచి స్నేహం కుదిరింది. నాకు ఒక స్కూల్‌ ఫ్రెండ్‌ దొరికినంత ఆనందంగా వుంది. సంగీతానికి స్కోప్‌ వున్న ఇలాంటి గొప్ప చిత్రానికి పనిచేయడం ఎంతో ఆనందంగా, ఉత్సుకతగా వుంది’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌, సమర్పకుడు బాపినీడు.బి,

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: సతీష్‌ బీకేఆర్‌, అశోక్‌ బండెడ్డ్రి, నటలు శ్యామల, కమలాకర్‌, రవి, సోనియాలు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ,హింది, మలయాళ భాష ల్లో ఏప్రిల్‌ 21 2023న విడుదల కానుంది.