తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ చిత్ర ఈవెంట్ కు పవన్ కళ్యాణ్!?

తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్నహీరో ఎవరంటే.. విజయ్ అని ఇట్టే చెప్పేస్తారు. అంతటి క్రేజ్ అతడిది. అత్యధిక పారితోషికంతో తమిళ ఇండస్ట్రీలోతనకంటూ ఓ చెక్కుచెదరని మార్కెట్ ని సృష్టించుకున్నాడు. తమిళ హీరో విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే అతడి దృష్టి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై పడింది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి విజయ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తన తాజా చిత్రం ‘వారసుడు’ తన గత సినిమాలకు మించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడని సమాచారం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాక్ బాగా వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. టాలీవుడ్..కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది! ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఎవ్వరినోటా విన్నా ఇదే మాట వినిపిస్తోంది.

విజయ్ ఇప్పుడు ‘వారసుడు’ సినిమాతో కూడా ఊహించని స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేసుకున్నాడు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే విజయ్ దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.

హీరో విజయ్ కెరీర్ లో ఇప్పటివరకు ఈ రెమ్యూనరేషనే హయ్యెస్ట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘వారసుడు’ తెలుగులో తప్పకుండా భారీ విజయాన్నినమోదు చేస్తుందన్న గట్టి నమ్మకం దిల్ రాజుకు ఉంది కాబట్టే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ తో దాదాపు అన్ని ఏరియాలకు డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయట! అయితే..

ఇంత భారీస్థాయిలో పెట్టుబడి పెట్టినప్పుడు మరి ప్రమోషన్స్ కూడా అలాగే ఉండాలి కదా.. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రమోషన్స్ ఈ సినిమాకు చాలా ముఖ్యం అని దిల్ రాజు భావించి ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ‘వారసుడు’ చిత్రానికి ఎంత ఎక్కువ స్థాయిలో హైప్ క్రియేట్ చేయగలిగితేనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయని దిల్ రాజు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. అసలే సంక్రాంతి సీజన్ లో ఓవైపు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, మరోవైపు నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సమరానికి ‘సై’ అంటూ మీసం మెలేస్తున్నాయి. ఈ సినిమాలకు బాగానే హైప్ పెరుగుతోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘వారసుడు’ సినిమా తట్టుకొని నిలదొక్కుకోవాలి అంటే మాటలు కాదు.. చేతలు కావాలి! అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి టాక్ చాలా పాజిటివ్ గా ఉండాలి.

అలా నుదలి అంటే.. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై దృష్టి సారించాలి. ఈ ఈవెంట్ గురించే ఇప్పుడు దిల్ రాజు బాగా ప్లాన్స్ వేస్తున్నారని టాలీవుడ్ కోడైకూస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఎవరిని ముఖ్య అతిధిగా పిలిస్తే ఈ ‘వారసుడు’ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందో దిల్ రాజు తీవ్రంగా ప్రణాళికలు చేస్తున్నారట. ఈ విషయం గురించి బాగా ఆలోచించిన దిల్ రాజు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ రంగంలోకి దించాలని, అలా అయితేనే.. ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని గట్టిగా నిర్ణయానికి ఒచ్చేశాడట. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన విజయ్ చిత్రం ‘బంగారం’ను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రమోషన్స్ లో కూడా విజయ్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాడు. అంతేకాకుండా విజయ్ నటించిన కొన్ని సినిమాలను తెలుగులో పవన్ రీమేక్ చేశాడు. అందులో ‘ఖుషి’ కూడా ఉంది. అంతేకాదు..

గతంలో పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమా చేయడం వలన ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావొచ్చు అంటున్నారు. అయితే.. ఈ ‘వారసుడు’ చిత్రాన్ని జనవరి 12న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ ను హైదరాబద్ లో భారీ స్థాయిలో నిర్వహించాలని దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నారట. దిల్ రాజు సంబరం సరే.. మరి ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడంటారా?! ఏమో.. వేచి చూద్దాం..!!