Elite Cricket League Season-2: చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2’ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బందరు రోడ్డులోని వివంతా హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, బుల్లితెర నటుడు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, టోర్నమెంట్ జెర్సీలను లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 నమూనాను ఆదర్శంగా తీసుకుని ఈ లీగ్ నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… సైనికుల సంక్షేమం కోసం చామల ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సీజన్లో ‘పొలిటికల్ టీమ్’ కూడా పాల్గొంటుందని, యువ మంత్రుల జట్టు కచ్చితంగా కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ... సేవా దృక్పథంతో క్రీడలను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు.
చామల ఫౌండేషన్ ఛైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది హైదరాబాద్లో సీజన్-1 విజయవంతమైందని, ఇప్పుడు విశాఖలో ఆరు జట్లతో సీజన్-2 నిర్వహిస్తున్నామని తెలిపారు.
* ఆంధ్ర పొలిటికల్ కింగ్స్
* టాలీవుడ్ థండర్స్
* బుల్లితెర రేంజర్స్
* మీడియా మాస్టర్స్
* శిరి ఇన్ఫో మిస్సైల్స్
* పోలీస్ లయన్స్

ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను సైనికుల సంక్షేమానికి, బంగారు కుటుంబాల అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ భాను చందర్ రెడ్డి, డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, సుధీర్ మైచర్ల, తరుణ్, అమిగోస్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

