ప్రధాని నరేంద్రమోదీకి దక్షిణ భారత దేశం కొరకరాని కొయ్యగా తయారయింది. ఇక్కడి రాష్ట్రాలలో బిజెపి బాహుబలి అని పేరున్న నరేంద్ర మోదీ ప్రభావం దాదాపు శూన్యం. కర్నాటకలో బిజెపి ప్రభుత్వం రాలేకపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభావం దాదాపు శూన్యం. మోదీపేరు ఉపయోగించినందున సాధించిందేమీ లేదు. ఇక ఆంధ్రలో కూడా అంతే. పార్టీ జండాలు మోసిన వాళ్లని కాదని, వాళ్లెవరూ బిజెపిని బతికించలేరని, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన కన్నా లక్ష్మినారాయణను అక్కడ రాష్ట్ర కమిటి అధ్యక్షుడిని చేశారు. అంటే, కర్నాటక, ఆంధ్ర, తమిళనాడులలో బాహుబలి మోదీ ప్రభావం ఏమీలేకపోవడం బిజెపి నాయకత్వాన్ని బాధిస్తూ ఉంది.
ఇపుడున్న ఈ రాష్ట్రాలలో ఉన్ బిజెపి ఉనికికి పునాది వేసింది వాజ్ పేయి, అద్వానీలే. మోదీ అదనంగా తెచ్చిందేమీ లేదు. తమిళనాడులో 2014 లో బిజెపికి వచ్చిందేమీలేదు. 2019లో కొంతమయిన లబ్దిపొందేందుకు అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. ఎఐడిఎంకె తో పొత్తుపెట్టుకున్నారు. ఇంకా ఏమోమో చేస్తున్నారు. ఇక కేరళలో కూడా చాలా వ్యూహాలు పన్నుతున్నారు.
అందుకే ఇక్కడి ప్రాంతీయ నాయకుల మీద ఆధారపడుకుండా దక్షిణ భారత దేశంలో పార్టీని పటిష్టపరిచేందుకు మోదీ స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నట్లు సమాచారం.
బహుశా దీనికి కారణం, దక్షిణ భారత రాష్ట్రాలలో చాలా బలమయిన బిజెపియేతర,కాంగ్రెసేతర ప్రాంతీయనాయకులుండటమే. కెసియార్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్, కుమార స్వామి,రెండో వరసలో ఉన్న కెటియార్, కవిత, హరీష్ రావు, పవన్ కల్యాణ్ వంటి నేతలతో ధీటయిన బిజెపి నాయకులెవరూ ఈ రాష్ట్రాలలో లేరు. ఈ రాష్ట్రాలలోని బిజెపి నాయకులంతా వీళ్ల పొత్తుతో గెలిచేవారే. ఈ రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెస్ ను కాదంటే ప్రాంతీయ పార్టీల వైపు వెళుతున్నారు గాని బిజెపి వైపు చూడటమే లేదు. అందుకే, తనే దక్షిణ భారత ఎంపిగా వచ్చి సౌత్ ఇండియన్లకు దగ్గరకావాలనుకుంటున్నారు మోదీ. మోదీ ఆశో అత్యాశో పోటీ చేస్తేగాని తెలియదు.
బిజెపి హిందీ పార్టీ. ఈ భాషే ఇక్కడ ఎవరికీ అర్థంకాదు. హిందీని ఎంత రుద్దినా ఎవరూ ఆ భాష ను నేర్చకోవడం లేదు. హిందీ సినిమాలు అర్థమయితే చాలనుకుంటున్నారు సౌత్ ఇండియన్లు. బిజెపి నేతలకు హిందీ తప్పమరొక భాష రాదు. ఈ గ్యాప్ ను బలమయిన ప్రాంతీయ నాయకులను తయారుచేసి కాంగ్రెస్ ఉపయోగించుకుంది. బిజెపికి అది చేతకావడంలేదు. చివరకు ఈ ప్రాంతం నుంచి పెరిగిన వెంకయ్యనాయుడిని కూడా దక్షిణ భారతీయులు పరాయివాడిగానే చూశారు. ఆయన తెలుగు యాసలో ఉండే హిందీ ని నార్తోళ్ల పెద్దగా ఆదరించలేదు. ఆయన జీవితకాలంలో ఒక్క సారి కూడా లోక్ సభకు వెళ్లలేదు. హిందీ బిజెపిని దూరంగా ఉంచడం దక్షిణ భారత లక్షణం లాగా కనిపిస్తుంది. దక్షిణంనుంచి బిజెపిలో ఏ నేత డిల్లీ స్థాయికి రాలేరని మోదీయే బెంగుళూరు రావాలనుకుంటున్నట్లుంది.
దీనికోసమే ఆయన కర్నాటక రాజధాని బెంగుళూరునుంచి లోక్ సభ కు పోటీచేయవచ్చని ప్రచారం మొదలయింది.
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ల నుంచి పోటీ చేస్తే గెలుపు అనుమానమే. అంతో ఇంతో బిజెపి బలంగా ఉండేది ఒక్క కర్నాకటలోనే. అందువల్ల నరేంద్ర మోదీ బెంగుళూరు సౌత్ (దక్షిణ బెంగుళూరు) నుంచి కూడా పోటీ చేందుకు పార్టీ చూస్తున్నదని తెలిసింది.
ఈ నియోజకవర్గం బిజెపికి పెట్టనికోట, అందుకే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని మొదటి జాబితాలో ప్రకటించలేదు.అక్కడ అభ్యర్థి రెడీ గా ఉన్నారు. అక్కడ ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి అనంతకుమార్ భార్య తేజస్విని అభ్యర్థి అని అందరికీ తెలిసిందే. అయినా సరే మొదటి జాబితాలో ఆమె పేరు లేదు. దీనికి కారణం, ఈ స్థానం నుంచి మోదీని రంగంలోకి దించేందుకు బిజెపి జయాపజయాలను బేరీజు వేసుకుంటూ ఉందని దక్కని హెరాల్డ్ రాసింది.
2014 లో లాగా ఈ సారి కూడా మోదీ రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకటి వారణాసి. రెండోది ఏది? అది బెంగూళూరు సౌత్ అని అందరికి అనుమానం. ఆయన కోసమే ఇక్కడి నుంచి తేజస్విని పేరు ప్రకటించలేదని అంటున్నారు.
గతంలో మోదీ గుజరాత్ నుంచి , వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ సారి గుజరాత్ గాంధీ నగర్ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీచేస్తున్నందున ప్రధాని దక్షిణాదికి వస్తారని,దానికి కర్నాటక ఒక్కటే అనువయిందని పార్టీ భావిస్తున్నదని తెలిసింది.
మోదీ కర్నాటక నుంచి పోటీ చేయవచ్చనే వార్త అక్కడి బిజెపి వర్గాల్లో ఉత్సాహం ఉరకలు పెట్టిస్తూ ఉంది. 2014 లో బిజెపి 17 లోక్ సభ స్థానాల్లో గెలుపొందింది. ఇపుడు మోదీ ఇక్కడి నుండి పోటీ చేస్తే పార్టీకి 22 సీట్లు తప్పక వస్తాయని, అంతేకాదు,దీని ప్రభావం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మీద కూడా ఉంటుందని బిజెపి కర్నాటక నేతలు చెబుతున్నారు.
దక్షిణాదిలో బిజెపి విజయవంతమయింది ఒక్క కర్నాటకలోనే, ఎపుడో 2008లోనే అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటయింది. దీనికి మోదీ అదనంగా కలిపిందేమీ లేదు. ఇది మోదీ సర్కిల్ లో ఇబ్బందిగా ఉంది. భారతదేశంలోని కీలకమయిన దక్షిణ భారతదేశాన్ని మోదీ మచ్చిక చేసుకోలేకపోయాడన్న నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ హాయంలో జెండా ఎగరేయకపోతే, దక్షిణ భారతదేశం ఎపుడూ కాషాయం పులుము కోలేదని, బిజెపి ఉత్తరాది పార్టీ అనే పేరు స్థిరపడుతుందని బిజెపి ఢిల్లీ నాయకత్వంలో ఆందోళన మొదలయిందని, ఆందుకే మోదీ దక్షిణం వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
