పెద్ద నోట్ల రద్దుతో అద్భుతాలేం జరగలేదుగానీ..

దేశం చాలా చాలా నష్టపోయింది పెద్ద నోట్ల రద్దు కారణంగా. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాజకీయ అవినీతి తగ్గలేదు సరికదా, పెరిగింది. పెట్రోల్ ధర యాభై రూపాయలైపోతుందనీ.. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయనీ.. పేదవాడికీ ధనవంతుడికీ మధ్య అంతరం తగ్గిపోతుందనీ.. దేశానికి అసలు అప్పులే వుండవనీ.. ఇలా పెద్ద నోట్ల రద్దు విషయమై చాలా చాలా కథలు విన్నాం.! ఏళ్ళు గడుస్తున్నాయ్.. కానీ, పెద్ద నోట్ల రద్దు చేసిన గాయం ఇంకా మానడంలేదు. చాలా జీవితాలు ఆ పెద్ద నోట్ల రద్దుతో చితికిపోయాయ్.. ఆ జీవితాలు కోలుకోలేదు, కోలుకునే పరిస్థితీ లేదు. వెయ్యి రూపాయల నోటు రద్దయ్యింది.. రెండు వేల రూపాయల నోటు వచ్చింది. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.!

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓట్లను కొనేందుకు వీలుగా రెండు వేల రూపాయల నోటు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది పరిస్థితి. పంపకానికి చాలా అనుకూలంగా మారింది ఈ రెండు వేల రూపాయల నోటు. అంతే తప్ప, ఇది సామాన్యుడికి మామూలుగా అయితే అందడంలేదు.

ప్రజలు తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని తీసుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చిన రోజులవి. రోజుకి రెండు వేలు మాత్రమే ఇష్తామంటూ బ్యాంకులు, సామాన్యుల్ని బిచ్చగాళ్ళలా చూసిన పరిస్థితులవి. ఆనాటి ఆ దారుణమైన రోజుల్ని ఎలా మర్చిపోగలం.? పెద్ద నోట్ల రద్దుతో రాజకీయ అవినీతి తగ్గుతుందన్నారు.. ఏదీ, ఎక్కడ.? నల్లధనం బయటకు వస్తుందన్నారు.. ఏదీ ఎక్కడ.? పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. అదొక దారుణం.. అదొక పీడకల.!