యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పార్లమెంటులో ఆందోళన చేయబోయిన పార్టీ ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శబరిమల వివాదం పై పార్లమెంటులో ఆందోళన చేయాలని కేరళ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సోనియా గాంధీ కేరళ ఎంపీలను పిలిపించుకొని పార్లమెంటులో ఆందోళన చేయవద్దని దీని పై రాద్దాంతం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు సమాన హక్కులు కావాలని పోరాడుతుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమాన హక్కులు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. శబరిమలలో మహిళల ప్రవేశం తప్పు ఎందుకు అవుతుందని ఆమె ఎంపీలను ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని ఈ సమయాన ఆందోళన చేయవద్దని ఆమె ఎంపీలతో అన్నారు.
ఎంపీలు ఆందోళన చేస్తే ప్రజలకు పార్టీ పట్ల తప్పుడు సంకేతాలు వెళతాయని బిజెపి కూడా ఇరుకున పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఆందోళనను కేవలం కేరళ రాష్ట్రానికి పరిమితం చేస్తే చాలని ఆమె వారికి సూచించారు. జాతీయ స్థాయిలో ఆందోళన చేయవద్దని చెప్పారు. కాదని ఎవరైనా ప్రవర్తిస్తే వారి పై చర్యలు తీసుకుంటామని సోనియాగాంధీ వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎంపీలు ఆందోళన చేయకుండా పార్లమెంటు సమావేశాలలో పాల్గొన్నారు.
