సానియా మీర్జా పై నెటిజన్ల ఆగ్రహం

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పై నెటిజన్లు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ పలు వివాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సానియా తాజగా మరోసారి విమర్శల పాలైంది. జమ్మూ కాశ్మీరిలోని పుల్వామాలో ఉగ్రదాడికి 42 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే దేశమంతా ఈ విచారంలో ఉంటే సానియా తన ట్విట్టర్ లో ఫ్యాషన్ ఫోటోలు పెట్టి విమర్శల పాలైంది.

సానియా మీర్జా శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు నెటిజన్ల ఆగ్రహానికి గురి చేసింది. “సరికొత్త డ్రెస్ వేసుకున్నాను చూడండి, డిజైన్ చేసింది వారు, మేకప్ చేసింది వీరూ…” అంటూ పర్సనల్ పిక్ ను పోస్టు చేసింది. ఇన్ స్టాగ్రాములో పెట్టి దానిని ట్వీట్ చేసింది. దీంతో దానిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దేశం మొత్తం ఉగ్రదాడికి బాధపడుతుంటే నువ్వు మాత్రం ఫ్యాషన్ ఫోటోలు అప్ లోడ్ చేస్తావా అంటూ వారు మండి పడ్డారు. నీ ఫోటోలు చూసేంత ఆసక్తి మాకు లేదు.. కనీసం దాడిపట్ల చిన్న స్పందన కూడా చేయలేదు. నువ్వు అసలు భారతీయురాలివేనా అంటూ వారు కడిగిపారేశారు. నీ చెల్లెల్ని ప్రమోట్ చేయడానికి ఇదా సమయం… నువ్వు నీ ఫోటో షూటులు అంటూ వారు సానియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో వ్యక్తి మాత్రం ఏకంగా సానియా పాక్ మహిళ… ఇలాంటి దాడులు జరిగితే స్పందించదు అని పెట్టాడు.

దీంతో విషయాన్ని గమనించిన సానియా వెంటనే ఈ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి స్థానం లేదంటూ సీరియస్ గా ట్వీట్ చేసింది. మృత వీరుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించింది. గతంలోనూ సానియా దేశ భక్తికి సంబంధించిన విషయంలో తప్పుగా ట్వీట్ చేసి నెటిజన్ల కోపానికి గురైంది. తాజాగా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి సానియా గురైంది.