భారతదేశ చరిత్రలోనే ఎన్నికల సంఘం తొలిసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రోజు మద్యం దుకాణాలు మాత్రమే బంద్ ఉండేవి. ఇక నుంచి ఎన్నికలు జరిగే రోజు సిగరెట్ దుకాణాలు కూడా బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటిక అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ గా వ్యవహరించే కలెక్టర్ కు ఈ ఆదేశాలు అందాయి. నిషేధం ఉన్నట్టు తెలియజేసే బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. సిగరెట్, బీడి, గుట్కా, నమిలే పొగాకు ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తుంది.
దేశంలో కేన్సర్ మరణాలకు పొగాకు ఉత్పత్తులే కారణమని ఆరోగ్య శాఖ గుర్తించింది. గొంతు, దవడ, ఊపిరితిత్తులు, లివర్ క్యాన్సర్ లు రావడానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులేనని ఇటివల ఆరోగ్య శాఖ గుర్తించింది. దీంతో ప్రజలకు వీటి పై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా పోలింగ్ బూత్ ల పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవచ్చు. భారత దేశంలో తొలిసారిగా 2019 పార్లెమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.
